కొత్తకొత్తగా ఉన్నది... పెళ్లి అక్కడే అన్నది | A growing craze for destination weddings | Sakshi
Sakshi News home page

కొత్తకొత్తగా ఉన్నది... పెళ్లి అక్కడే అన్నది

May 15 2023 4:08 AM | Updated on May 15 2023 4:08 AM

A growing craze for destination weddings - Sakshi

భారతీయ జంటలు వివాహ వేడు­కలకు కొత్త ప్రాంతాలను అన్వేషిస్తున్నాయి. వివా­హమనే మధుర ఘట్టాన్ని జీవితంలో మరుపు­రాని క్షణంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తు­న్నాయి. అందుకే చారిత్రక, సాంస్కృతిక, బీచ్, పర్యా­టక ప్రాశస్త్యం కలిగిన కేంద్రాలను పెళ్లి వేదిక­లుగా మార్చుకుంటున్నాయి. ఫలితంగా దేశంలో సంప్రదాయ వివాహాలకు భిన్నంగా ‘డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌’కు  ప్రాధాన్యత  పెరుగుతోంది. ఆర్థికంగా  స్థిరపడినవారు విదేశాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకుంటుం­టే.. మధ్యతరగతి ప్రజలు దేశంలోని సుదీర్ఘ, మూరుమూల ప్రాంతాల్లో పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. – సాక్షి, అమరావతి

అతిథులు తక్కువ.. ఖర్చు ఎక్కువ!
కోవిడ్‌ సమయంలో తక్కువ మంది అతిథుల మధ్య వివాహాలు జరిగాయి. ఫలితంగా పెళ్లిళ్ల బడ్జెట్‌ కూడా తగ్గింది. అయితే కోవిడ్‌కి ముందు పెళ్లికి హాజరయ్యే సగటు అతిథుల సంఖ్య 350–400గా ఉండేది. కానీ.. ప్రస్తుతం ఇది 150నుంచి 250 వరకు వచ్చింది. అయినప్పటికీ పెళ్లిళ్ల బడ్జెట్లు మాత్రం భారీగా ఉంటున్నాయి. అతిథుల జాబితాలు తగ్గిపోయినప్పటికీ.. వివాహాలను వైభవంగా చేసుకోవడానికి ఎక్కడా రాజీ పడట్లేదు. చాలామంది డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లు/వెడ్‌టెక్‌ సంస్థలను సంప్రదిస్తూ రిసార్ట్స్, డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లను ఎంచుకోవడమే ఇందుకు కారణం. 

25 శాతం వివాహాలు భారతదేశంలోనే..: ప్రపంచవ్యా ప్తం­గా ఏటా జరిగే వివాహాల్లో 25 శాతం భారత్‌లోనే ఉంటున్నాయి. భూమ్మీద జరిగే ప్రతి నాలుగు పెళ్లిళ్లలో ఒకటి భారతీయులదే. ప్రపంచ వివాహ పరిశ్ర­మలో భారత్, చైనాల వాటాయే అత్యధికం. ఇక దేశీ­యంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గోవా, లక్షద్వీప్, కేరళ, హేవ్‌లాక్‌ ఐలాండ్, మహారాష్ట్రలోని ఆలీబాగ్‌ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లకు కేంద్రాలుగా మారాయి. రాజ­స్థాన్‌ దేశంలోనే గొప్ప వెడ్డింగ్‌ డెస్టినేషన్‌గా కొనసాగుతోంది.

అక్కడి పురాతన కోటలు, రాజప్రాసాదాల మధ్య వివా­హా­లకు యువత ఆసక్తి చూపుతోంది. జైపూర్, ఉదయ్‌­పూర్, జోధ్‌పూర్, జైసల్మేర్, రణతంబోర్, బికనీర్‌ వెడ్డింగ్‌ ప్లానర్లకు ప్రధాన కేంద్రాలు మారాయి. దేశంలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కు సగటున రూ.15 లక్షల నుంచి రూ.4 కోట్ల వరకు ఖర్చవుతోంది. ఉన్నత వర్గాల్లో అయి­తే ఒక్కో అతిథికి రూ.60 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇక్కడ సముద్ర తీర ప్రాంతాల్లో పెళ్లిళ్లు చేసుకునేందుకు యువత ఎక్కువ ఆసక్తి చూపడం విశేషం.

థాయ్‌లాండ్‌లో అత్యధికం..: భారతీయులు విదేశీ వెడ్డింగ్‌ డెస్టినేషన్‌గా థాయ్‌లాండ్‌ను ఇష్టపడుతు­న్నారు. గత ఏడాది అక్కడ జరిగిన విదేశీ పెళ్లిళ్లలో 60% భారతీ­యులవే కావడం విశేషం. మునుపెన్నడూ లేనంతగా భారతీయ జంటలు బ్యాంకాక్, కో స్యామ్యూయ్, ఫుకె­ట్, హువా హిన్, చయాంగ్‌ మాయ్‌ వివాహ వేడుకలకు కేరాఫ్‌గా మారాయి. థాయ్‌ టూరిజం అథారిటీ సైతం భారత్‌లోని వెడ్డింగ్‌ ప్లానర్ల భాగస్వామ్యం కలిగి ఉం­డ­టంతో సగటు ఏటా 400 జంటలు బంధుమిత్ర సమే­తంగా అక్కడకు వెళ్లి వివాహాలు చేసుకుంటున్నాయి.  

దేశంలో వెడ్డింగ్‌ టూరిజం పాలసీ
భారతదేశంలో కూడా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ముసాయిదాను కూడా సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా 50కిపైగా డెస్టినేషన్ల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు పుణ్యక్షేత్రాలు డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కేంద్రాలుగా ఉన్నాయి. ఇకపై అరకు, కోనసీమ, విశాఖ సాగర తీరం, హార్ల్సీ­హిల్స్, ఇరుక్కం దీవి, పిచ్చుకల్లంక, హోప్‌­ఐలాండ్‌ ప్రాంతాలను విదేశీయులను సైతం ఆకర్షించేలా ఏపీటీడీసీ అభివృద్ధి చేయనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement