నదిలో నీళ్లు చల్లుతున్నారు.. కొత్త టెక్నిక్‌ కాదు.. మరేంటి! | Govt Sprays Water in Yamuna River to Curb Toxic Foam, Twitter Reacts | Sakshi
Sakshi News home page

నదిలో నీళ్లు చల్లుతున్నారు.. కొత్త టెక్నిక్‌ కాదు.. మరేంటి!

Nov 10 2021 5:50 PM | Updated on Nov 10 2021 5:52 PM

Govt Sprays Water in Yamuna River to Curb Toxic Foam, Twitter Reacts - Sakshi

యమునా నదిలో కాలుష్యంపై నెటిజనులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

న్యూఢిల్లీ: యమునా నదిలో కాలుష్యంపై నెటిజనులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాలుష్యం పెరిగిపోవడంతో యమునా నది విషపూరిత నురుగులతో నిండిపోయింది. ఇందులో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయ్యాయి. నీటిపై తేలియాడుతూ తెరతెరలుగా తరలివస్తున్న విషపూరిత నురుగును తొలగించడానికి ఢిల్లీ వాటర్‌ బోర్డు అధికారులు చేపట్టిన తాత్కాలిక చర్యలు అపహాస్యానికి గురయ్యారు. 


కాళింది కుంజ్ వద్ద నురగను అడ్డుకోవడానికి 15 పడవలను రంగంలోకి దించారు. వెదురు తడికలు అడ్డుకట్టి నురగను ఆపడానికి ప్రయత్నించారు. నదిలో పేరుకుపోయిన విషపు నురగను తొలగించడానికి పైపు ద్వారా నీటిని వెదచల్లారు. (చదవండి: సినిమా సెట్టింగో.. స్పెషల్‌ ఎఫెక్టో అనుకుంటున్నారా..!)


ఈ చర్యలపై ట్విటర్‌లో నెటిజనులు తమదైన శైలిలో స్పందించారు. ‘ఇదేదో కొత్త టెక్నిక్‌లా ఉందే.. మాకూ చెబితే ఊరి చెరువులను శుభ్రం చేసుకుంటామంటూ’ సెటైర్లు పేల్చారు. ‘వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రతి భారతీయుడు తమ టేబుల్ ఫ్యాన్‌లను తెరిచిన కిటికీల వైపు చూపించాలని ప్రభుత్వం ఆదేశించింది’ అంటూ మరొకరు చురక అంటించారు. ‘RIP Science’ అంటూ ఇంకొరు సానుభూతి ప్రకటించారు. 


యమునా నదిలో కాలుష్య నివారణకు శాశ్వత చర్యలు చేపట్టకుండా నిర్లిప్తంగా వ్యవహరిస్తున్న పాలకులు, అధికారులపై వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి కాలుష్యాన్ని తగ్గించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని హస్తిన వాసులు డిమాండ్‌ చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement