54 ఉన్నత విద్యాసంస్థలకు గ్లోబల్‌ గుర్తింపు | Global recognition for 54 higher education institutions | Sakshi
Sakshi News home page

54 ఉన్నత విద్యాసంస్థలకు గ్లోబల్‌ గుర్తింపు

Jun 20 2025 2:44 AM | Updated on Jun 20 2025 2:44 AM

Global recognition for 54 higher education institutions

క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌–2026లో భారత్‌ కొత్త రికార్డు  

వరుసగా 14వ సంవత్సరం ‘ఎంఐటీ’టాప్‌.. 

ఆ తర్వాత స్థానాల్లో ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌.. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌  విశ్వవిద్యాలయం 

ప్రపంచ 123వ ర్యాంకుతో దేశంలో ఐఐటీ ఢిల్లీ టాప్‌.... 118 నుంచి 129కి పడిపోయిన ఐఐటీ బాంబే ర్యాంకు 

ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఖరగ్‌పూర్‌ ర్యాంకుల్లో పురోగతి 

ఐఐటీ హైదరాబాద్‌కు 664వ ర్యాంకు.. 

ప్రధాని మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ హర్షం 

సాక్షి. న్యూఢిల్లీ: విద్యారంగంలో భారత్‌ మరో మైలురాయిని అందుకుంది. క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్శిటీ ర్యాంకింగ్స్‌–2026లో మన దేశానికి చెందిన 54 ఉన్నత విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఈ రంగంలో ఇప్పటివరకు భారత్‌ అందుకున్న అతిపెద్ద గ్లోబల్‌ రికార్డు ఇది. లండన్‌కు చెందిన గ్లోబల్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అనలిటిక్స్‌ సంస్థ క్వాక్‌క్వరెల్లీ సిమండ్స్‌ (క్యూఎస్‌) గురువారం విడుదల చేసిన వరల్డ్‌ యూనివర్శిటీ ర్యాంకింగ్స్‌–2026 జాబితాలో ప్రపంచంలోని 1,500కి పైగా అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఈ ర్యాంకింగ్‌ కోసం అకడెమిక్‌ ప్రతిష్ట, ఫ్యాకల్టీ–సూ్టడెంట్‌ నిష్పత్తి, రీసెర్చ్‌ ప్రభావం, అంతర్జాతీయ విద్యార్థుల భాగస్వామ్యం, గ్రాడ్యుయేట్ల ఉద్యోగావకాశాలు వంటి తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటారు.  

వరుసగా 14వ సంవత్సరం ‘ఎంఐటీ’టాప్‌.. 
అమెరికా కేంబ్రిడ్జిలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయంగా వరుసగా 14వ సంవత్సరం కూడా తొలి ర్యాంకు పొందింది. తరువాత.. ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ రెండో స్థానంలో, అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం మూడవ స్థానంలో ఉన్నాయి. జాబితాలో 192 విద్యాసంస్థలతో అత్యధిక ప్రాతినిధ్యం వహించే దేశంగా అమెరికా ఉంది. గత సంవత్సరం నుండి దాదాపు 500 విశ్వవిద్యాలయాలు తమ పనితీరును మెరుగుపరుచుకున్నాయి. వీటిలో మలేసియాలోని సన్‌వే యూనివర్సిటీ 120 స్థానాలకు పైగా తన ర్యాంకును మెరుగుపరుచుకుంది.  

భారత్‌లో ఐఐటీ–ఢిల్లీ టాప్‌.. 
ఇక ఈ క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్న భారత్‌లోని 54 ఉన్నత విద్యాసంస్థల్లో 65.5 స్కోర్‌తో ఐఐటీ–ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 2025లో 150, 2024లో 197 ర్యాంకు నుంచి ఈ ఏడాది ప్రపంచంలో 123వ స్థానానికి చేరుకుంది. అకడమిక్‌ రెప్యుటేషన్‌లో 142వ స్థానంలో, ఫ్యాకలీ్టకి సైటేషన్స్‌లో 86వ స్థానంలో నిలిచింది. దేశంలోని ఇతర ఐఐటీలు, ప్రధాన వ ర్సిటీలూ ప్రభావవంతమైన ప్రదర్శన చేశాయి. 

ఐఐటీ హైదరాబాద్‌కు 664వ ర్యాంకు, వెల్లూరు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నా లజీ (విట్‌)కు 691వ ర్యాంకు, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌కు 801–850 మధ్య ర్యాంకు, ఉస్మానియా యూనివర్సిటీ 1,201–1,400 మధ్య ర్యాంకులో నిలిచింది. అలాగే, ఐదు భారతీయ విశ్వవిద్యాలయాలు ఎంప్లాయర్‌ రెప్యుటేషన్‌ కోసం పోటీపడి ప్రపంచవ్యాప్తంగా టాప్‌–100లో స్థా నం సంపాదించాయి. అంతేకాక.. సగటున 43.7 స్కోరుతో 8 భారతీయ విద్యాసంస్థలు పరిశోధన ప్రభావం పరంగా సైటేషన్స్‌ ఫర్‌ ఫ్యాకల్టీలో టాప్‌–100లో స్థానం సంపాదించాయి. 

ఇక 2025లో ఉత్తమ భారతీయ విశ్వవిద్యాలయంగా ర్యాంకు పొంది గతేడాది 118వ స్థానంలో ఉన్న ఐఐటీ బాంబే, ఈ సంవత్సరం 129వ స్థానానికి పడిపోయింది. ఐఐటీ మద్రాస్‌ గతేడాదితో పోలిస్తే 47 స్థానాలు ఎగబాకి 180వ స్థానానికి చేరుకుంది. ఐఐటీ ఖరగ్‌పూర్‌ (215), ఐఐఎస్‌సీ బెంగళూరు (219), ఢిల్లీ వర్సిటీ (328).. ఓపీ జిందాల్‌ గ్లోబల్‌ యూనివర్సిటీ (851–900), బిట్స్‌ పిలాని (668) వంటివి కూడా తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నాయి. 

ప్రపంచంలో భారత్‌కు 4వ స్థానం.. 
ఇదిలా ఉంటే.. ఈ సంవత్సరం భారత్‌ నుంచి ఎనిమిది కొత్త విద్యాసంస్థలు మొదటిసారిగా ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్నాయి. దీంతో జాబితాలో చోటు దక్కించుకున్న మొత్తం భారతీయ విద్యా సంస్థల సంఖ్య 54కి చేరుకుంది. అమెరికా (192), యూకే (90), చైనా (72) తర్వాత నాలుగో స్థానంలో భారత్‌ నిలిచింది. ఈ సంవత్సరం మరే దేశ విద్యా సంస్థలు కూడా ఇంత ఎక్కువ సంఖ్యలో క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకోలేదు. ఇక ఈ ఏడాది ఎనిమిది కొత్త విద్యా సంస్థలకు ర్యాంకులతో భారత్‌ తొలిస్థానంలో ఉండగా.. జోర్డాన్, అజర్‌బైజాన్‌ దేశాలు ఆరు కొత్త సంస్థలతో రెండో స్థానంలో ఉన్నాయి.  

ప్రధాని, కేంద్రమంత్రి హర్షం.. 
క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ–2026 ర్యాంకింగ్స్‌లో భారత్‌ సాధించిన మైలురాయిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లు హర్షం వ్యక్తంచేశారు. ఈ ర్యాంకింగ్స్‌ మన విద్యా రంగానికి గొప్ప కీర్తిని తెస్తున్నాయని.. దేశ యువత ప్రయోజనం కోసం పరిశోధన, ఆవిష్కరణ, పర్యావరణ వ్యవస్థలను మరింతగా పెంచడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ గురువారం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. 

అలాగే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కూడా ‘ఎక్స్‌’వేదికగా స్పందిస్తూ.. ‘2014లో కేవలం 11 భారత విద్యాసంస్థలు మాత్రమే ఈ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకోగా, ఇప్పుడా సంఖ్య అయిదింతలు పెరిగి 54కి చేరింది. ఇది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత దశాబ్దంలో అమలుచేసిన విద్యా సంస్కరణల ఫలితం. అలాగే, నూతన విద్యా విధానం (ఎన్‌పీఈ)–2020 వల్ల ఇది సాధ్యమైంది. రికార్డు స్థాయిలో 54 సంస్థలు ఆ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకోవడం భారత విద్యావ్యవస్థలో సంభవించిన మార్పు, పురోగతికి నిదర్శనం. ఇది ఒక మార్పు మాత్రమే కాదు–ఒక విద్యా విప్లవం’అని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement