
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి
న్యూఢిల్లీ: వాహనాలకు హారన్గా భారతీయ సంగీత ధ్వనులు మాత్రమే వచ్చేలా త్వరలో చట్టం తేవాలని యోచిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. నవభారత్ టైమ్స్ 78వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం ఏర్పాటైన కార్యక్రమంలో గడ్కారీ ప్రసంగించారు. అన్ని రకాల వాహనాలకు కూడా భారతీయ సంగీత ధ్వనులే హారన్గా ఉంటాయని, వీటిని వినడం ఆహ్లాదకరంగా కూడా ఉంటుందన్నారు.
సంగీత పరికరాలైన ఫ్లూట్, తబలా, వయోలిన్, హార్మోనియం ధ్వనులు ఇందులో ఉంటాయన్నారు. దేశంలో మొత్తం వాయు కాలుష్యం రవాణా రంగం వాటా 40 శాతం వరకు ఉంటుందని చెప్పారు. మన ఆటోమోబైల్ మార్కెట్ అమెరికా, చైనాల తర్వాత జపాన్ను వెనక్కి నెట్టిసి మూడో స్థానంలో నిలిచామన్నారు. 2014లో భారత ఆటోమోబైల్ రంగం విలువ రూ.14 లక్షల కోట్లు కాగా నేడది రూ.22 లక్షల కోట్లకు చేరిందన్నారు. కార్లు, ద్విచక్ర వాహనాల ఎగుమతి వల్లే దేశానికి ఎక్కువ ఆదాయం వస్తోందని వెల్లడించారు.