‘లింగ వివక్ష బస్సులు’.. ఉచిత బస్సులపై రచ్చ! | Extend Free KSRTC Bus Travel to Male Students: LDF Leader Jose K Mani Urges Kerala Govt | Sakshi
Sakshi News home page

‘లింగ వివక్ష బస్సులు’.. ఉచిత బస్సులపై రచ్చ!

Jun 6 2026 8:29 AM | Updated on Jun 6 2026 8:40 AM

Extend Free KSRTC Bus Travel to Male Students: LDF Leader Jose K Mani Urges Kerala Govt

తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం మహిళలు, విద్యార్థినులకు కేఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయ, సామాజిక చర్చకు దారితీసింది. 2026, జూన్ 15 నుంచి అమలు కానున్న ఈ పథకాన్ని ఎల్‌డీఎఫ్ (డీఎల్‌ఎప్‌) కూటమి భాగస్వామ్య పక్షమైన కేరళ కాంగ్రెస్ (ఎం) ఛైర్మన్ జోస్ కె. మణి స్వాగతించారు. అయితే ఈ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కేవలం అమ్మాయిలకే పరిమితం చేయడం వల్ల విద్యార్థుల మధ్య లింగ వివక్ష తలెత్తే ప్రమాదం ఉందని ఆయన  ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఒక వర్గానికే కాకుండా, అబ్బాయిలకూ ఈ ఉచిత సౌకర్యాన్ని వర్తింపజేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా విజ్ఞప్తి చేశారు.

విద్యార్థుల్లో వివక్ష వద్దు 
పాఠశాలలు, కళాశాలల్లో మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు వంటి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందించేటప్పుడు అబ్బాయిలు, అమ్మాయిల మధ్య ఎలాంటి తేడాలు చూపడం లేదని జోస్ కె. మణి గుర్తుచేశారు. కేవలం రవాణా సౌకర్యం విషయంలోనే ఇలాంటి భేదాలు చూపడం సమంజసం కాదని ఆయన తన ఫేస్‌బుక్ పోస్ట్, వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఒకే తరగతిలో కలిసి చదువుకునే విద్యార్థుల్లో ఒకరికి ఉచిత ప్రయాణం, మరొకరికి కాదనడం వల్ల వారి మధ్య తారతమ్యాలు ఏర్పడతాయని, అందువల్ల లింగభేదం లేకుండా విద్యార్థులందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు.

ఉచిత రవాణా ఒక పెట్టుబడి 
విద్యా రంగంలో కేరళ ఎప్పుడూ ముందుంటుందని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం 12వ తరగతి వరకు ఉన్న విద్యార్థులందరికీ ఉచిత రవాణా విధానాన్ని తీసుకురావాలని జోస్ కె. మణి ప్రతిపాదించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో సుమారు 33 లక్షల మంది విద్యార్థులు వివిధ ప్రయోజనాలను పొందుతున్నారని, దీనికి అదనంగా ఇల్లు - పాఠశాల మధ్య ఉచిత ప్రయాణ గ్యారంటీని కూడా జోడించాలన్నారు. ఈ పథకానికి అయ్యే ఖర్చును ప్రభుత్వం ఆర్థిక భారంగా భావించకూడదని, ఇది రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగా చూడాలని ఆయన హితవు పలికారు.

కేఎస్‌ఆర్‌టీసీ ముందడుగు వేయాలి 
ఈ ఉచిత ప్రయాణ విధానాన్ని ప్రభుత్వ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులకూ వర్తింపజేయాలని జోస్ కె. మణి సూచించారు. ప్రస్తుతానికి ప్రైవేట్ ఆపరేటర్లకు ఈ పథకాన్ని విస్తరించడం సాధ్యం కాకపోతే, కనీసం కేఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లోనైనా హయ్యర్ సెకండరీ స్థాయి వరకు ఉన్న విద్యార్థులందరికీ తక్షణమే ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు చదువుకోవడానికి రవాణా అనేది ఒక ముఖ్యమైన అవసరమని, ఇల్లు దాటి విద్యాసంస్థకు వెళ్లి, మళ్లీ సురక్షితంగా ఇళ్లకు చేరుకునే పూర్తి బాధ్యతను ప్రభుత్వమే భరించాలని ఆయన స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: సురేష్‌ గోపీ రాజీనామా?.. సస్పెన్స్‌కు ఎండ్ కార్డ్!

Advertisement
 
Advertisement
Advertisement