
న్యూఢిల్లీ: ఓటింగ్ సమయంలో పోలింగ్ ప్రక్రియపై పర్యవేక్షణను మరింతగా పెంచాలని ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ణయించింది. ఇందులో భాగంగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ను ప్రస్తుతమున్న 50 శాతం నుంచి వందశాతానికి పెంచనుంది. అయితే, వెబ్కాస్టింగ్ డేటా ఈసీ వినియోగానికి మాత్రమే పరిమితం. ఈ విధానాన్ని ఈ ఏడాదిలో బిహార్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారిగా అమలు పర్చనుంది.
ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న అన్ని పోలింగ్ బూత్లలోనూ వెబ్కాస్టింగ్ అమలు చేయాలని ఈసీ తాజాగా రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ అధికారులకు తెలిపింది. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని ప్రాంతాల్లో వీడియో గ్రఫీ, ఫొటో గ్రఫీ వంటివాటిని వాడుకోవాల్సి ఉంటుందని తెలిపింది. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతున్నదీ లేనిదీ పరిశీలించేందుకు 50 శాతం పోలింగ్ కేంద్రాల్లోనూ, సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నవాటిలోనూ ప్రస్తుతం వెబ్కాస్టింగ్ను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే.