ఢిల్లీ మెట్రో @ 23.. ఈ ఎనిమిది విశేషాలు తెలుసా? | DMRC Inauguration Day Unique Things About Delhi Metro, Engineering Marvel, Eco-Friendly Transport, And Lifeline Of The Capital | Sakshi
Sakshi News home page

ఢిల్లీ మెట్రో @ 23.. ఈ ఎనిమిది విశేషాలు తెలుసా?

Dec 24 2025 8:36 AM | Updated on Dec 24 2025 11:00 AM

DMRC Inauguration Day Unique Things about Delhi Metro

దేశ రాజధాని ఢిల్లీ పేరు వినగానే మనకు ఎర్రకోట, ఇండియా గేట్  ఏ విధంగా గుర్తుకు వస్తాయో.. ఢిల్లీ మెట్రో కూడా కళ్లముందు మెదులుతుంది. 2002 డిసెంబర్ 24న నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పచ్చజెండా ఊపి, ప్రారంభించిన ఈ మెట్రో రైలు.. నేడు ప్రపంచ స్థాయి రవాణా వ్యవస్థగా ఎదిగింది. దేశంలోని ఇతర నగరాల్లో మెట్రో విప్లవానికి నాంది పలికిన ఢిల్లీ మెట్రో ప్రస్థానం వెనుక ఎన్నో ఆసక్తికరమైన అంశాలు దాగున్నాయి.

8 కిలోమీటర్ల నుండి 300+ కిలోమీటర్ల వరకు..
ఢిల్లీ మెట్రో ప్రయాణం షాదరా నుండి టిస్ హజారీ వరకు కేవలం 8.2 కిలోమీటర్ల ‘రెడ్ లైన్’తో మొదలైంది. ఆ రోజున కశ్మీర్ గేట్ వద్ద ప్రధాని వాజ్‌పేయి, నాటి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, మెట్రో మ్యాన్ శ్రీధరన్‌లు ఒక కొత్త చరిత్రను లిఖించారు. నేడు అదే నెట్‌వర్క్ 390 కిలోమీటర్లకు పైగా విస్తరించి, దాదాపు 286 స్టేషన్లతో ఢిల్లీ మహానగరం నలుమూలలనూ కలుపుతోంది. లండన్, న్యూయార్క్ తదితర మెట్రో దిగ్గజాల సరసన ఢిల్లీ మెట్రో  చేరడం మన దేశానికే గర్వకారణంగా నిలిచింది.

కోల్‌కతా స్ఫూర్తి.. ఢిల్లీ విజయం
భారతదేశంలో మెట్రో అంటే కోల్‌కతా గుర్తుకు వస్తుంది. 1984లోనే అక్కడ సేవలు ప్రారంభమైనప్పటికీ, ఆధునిక సాంకేతికతతో పూర్తిస్థాయి మెట్రో నెట్‌వర్క్‌ను దేశానికి పరిచయం చేసింది ఢిల్లీ మెట్రోనే అని చెబుతారు. కోల్‌కతా విజయాన్ని స్ఫూర్తిగా తీసుకున్న ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ), అంతర్జాతీయ ప్రమాణాలతో అతి తక్కువ కాలంలోనే ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. కేవలం రవాణా మాత్రమే కాదు, సమయపాలనలోనూ ఢిల్లీ మెట్రో 99 శాతానికిపైగా ఖచ్చితత్వాన్ని పాటిస్తోంది.

ఆశ్చర్యపరిచే స్టేషన్ల నిర్మాణం
ఢిల్లీ మెట్రో నిర్మాణంలో ఇంజనీరింగ్ అద్భుతాలు ఎన్నో కనిపిస్తాయి. హౌజ్ ఖాస్ స్టేషన్ భూమికి సుమారు 95 అడుగుల (29 మీటర్లు) లోతులో ఉండి, అత్యంత లోతైన స్టేషన్‌గా రికార్డు సృష్టించింది. ఒక సాధారణ 10 అంతస్తుల భవనం లోతుకు సమానమైన ఈ స్టేషన్ దాటాలంటే ఎస్కలేటర్లపై ప్రయాణం ఒక అడ్వెంచర్‌ను తలపిస్తుంది. మరోవైపు ‘ఆశ్రమ్’ మెట్రో స్టేషన్ ప్రపంచంలోనే అతి చిన్న మెట్రో స్టేషన్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. స్థలాభావం వల్ల దీనిని కేవలం ఒకే ఎంట్రీ/ఎగ్జిట్ పాయింట్‌తో అద్భుతంగా రూపొందించారు.

కశ్మీర్ గేట్.. మెట్రో నెట్‌వర్క్ గుండెకాయ
ఢిల్లీ మెట్రోలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం కశ్మీర్ గేట్. ఇది కేవలం స్టేషన్ మాత్రమే కాదు, ఒక మహా సముద్రం. రెడ్, ఎల్లో,  వైలెట్ లైన్లు కలిసే ఈ ‘ట్రిపుల్ ఇంటర్చేంజ్’ స్టేషన్ దేశంలోనే అతిపెద్దది. సుమారు  ఎనిమిది ఎంట్రీ గేట్లు కలిగిన ఈ స్టేషన్ గుండా రోజుకు లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. దీని నిర్మాణం ఢిల్లీ రవాణా వ్యవస్థలో ఒక మైలురాయిగా నిలిచింది

మెట్రో కోచ్‌ల వెనుక ‘ఈవెన్’ సీక్రెట్
ఢిల్లీ మెట్రో రైళ్లకు ఎప్పుడూ 4, 6 లేదా 8 కోచ్‌లే ఉంటాయి. బేసి సంఖ్యలో (5 లేదా 7) కోచ్‌లు ఎందుకు ఉండవు? దీని వెనుక సాంకేతిక కారణం ఉంది. మెట్రో కోచ్‌లు ఎప్పుడూ జంటగా (Pair) పనిచేస్తాయి. ఒక కోచ్‌లో డ్రైవర్ క్యాబిన్/కంట్రోల్ సిస్టమ్ ఉంటే, దానికి అనుసంధానంగా ఉండే మరో కోచ్ ఇంజిన్ లేదా మోటార్‌ను కలిగి ఉంటుంది. ఇవి రెండు కలిస్తేనే ఒక ‘యూనిట్’ పూర్తవుతుంది. అందుకే ఢిల్లీ మెట్రోలో ఎప్పుడూ సరి సంఖ్యలో కోచ్‌లు కనిపిస్తాయి.

పర్యావరణ హితం.. ప్రపంచంలోనే మొదటిది
పర్యావరణ పరిరక్షణలో ఢిల్లీ మెట్రో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. కార్బన్ ఉద్గారాలను తగ్గించినందుకు ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) నుండి కార్బన్ క్రెడిట్స్ పొందిన ప్రపంచంలోని మొట్టమొదటి మెట్రో వ్యవస్థగా ఢిల్లీ మెట్రో నిలిచింది. సోలార్ ఎనర్జీ వినియోగం, వర్షపు నీటి సంరక్షణలో డీఎంఆర్‌సీ అమలు చేస్తున్న విధానాలు అద్భుతమని పలువురు కొనియాడుతుంటారు. రోజుకు దాదాపు 28 లక్షల మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరవేస్తూ, రోడ్లపై వేల సంఖ్యలో వాహనాలు తగ్గుదలకు కారణంగా నిలిచింది.

మెట్రో మ్యూజియం: అరుదైన విజ్ఞాన భాండాగారం
మెట్రో ఎలా పనిచేస్తుంది? ఈ రైళ్లు ఎక్కడ నుండి వచ్చాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే పటేల్ చౌక్ మెట్రో మ్యూజియం సందర్శించాల్సిందే. దక్షిణాసియాలోనే మెట్రో రైల్వేకు గల ఏకైక మ్యూజియం ఇది. ఢిల్లీ మెట్రో అభివృద్ధి చెందిన తీరు, దీనికి సంబంధించిన ఫోటోలు, మోడల్ రైళ్లు, సాంకేతిక విశేషాలు ఇక్కడ కొలువుదీరాయి. భావి తరాలకు ఇది ఒక విజ్ఞాన భాండాగారంగా ఉపయోగపడుతోంది.

రాజధానికి జీవనాధారం
నేడు ఢిల్లీ మెట్రో కేవలం ఒక రవాణా మార్గం కాదు, అది ఢిల్లీ ప్రజల జీవనశైలిలో భాగమైంది. ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్ ద్వారా విమానాశ్రయానికి వేగంగా చేరడం నుండి, మెరుగైన భద్రత, మహిళల కోసం ప్రత్యేక కోచ్‌ల వరకు.. ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు ఒక భరోసాను అందిస్తోంది. ఢిల్లీ నుండి ప్రారంభమైన ఈ మెట్రో విప్లవం నేడు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వ్యాపించి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది.

ఇది కూడా చదవండి: పాక్‌ నేత తిరుగుబాటు.. భారత్‌కు మద్దతు

Advertisement
 
Advertisement
Advertisement