భారత రాజకీయాల్లో భీష్మ పితామహుడు అటల్ బిహారీ వాజ్పేయి. రాజనీతిజ్ఞుడిగా, రాజకీయాల్లో అజాత శత్రువనే గుర్తింపు దక్కించుకున్న ఆయన.. సాహితి లోకానికి కవిగా, ఆరేళ్లపాటు ప్రధానిగా, బీజేపీకి ముఖ్యనేతగా సేవలందించారు. అయితే చివరిసారిగా ఆయన పబ్లిక్కు కనిపించింది ఎప్పుడో, అదీ ఏ సందర్భంలోనో తెలుసా?..
గెలుపు-ఓటమి ఈ రెండింటినీ నవ్వుతూ స్వీకరించే నైజం వాజ్పేయిది. 2004లో దారుణ ఓటమి తర్వాత కూడా.. ఎలా ఓడిపోయారు? అంటే.. ‘ఓడిపోయాం.. అంతే’ అంటూ చిరునవ్వు విసిరారు ఆయన. అందుకే అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఆయనపై అందరికీ గౌరవం ఉండేది. అయితే ఆయన పాలనను, ఆదర్శాలను పొగిడేటోళ్లే తప్పించి.. వాటిని ఆచరించే నేతలు ఈరోజుల్లో లేరనే అంటారు రాజకీయ విశ్లేషకులు.
2004 ఓటమి తర్వాత వాజ్పేయి.. పార్లమెంటరీ పార్టీ చైర్మన్గా, బీజేపీ కీలక సమావేశాల్లో మాత్రమే పాల్గొంటూ వచ్చారు. అయితే 2005 డిసెంబర్లో పుట్టినరోజు దగ్గరపడుతుండగా.. రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించి, అభిమానులకు, కార్యకర్తలకు పెద్ద షాక్ ఇచ్చారు ఆయన. ఇక ఎన్నికల బరిలోకి దిగనప్పటికీ.. పార్టీకి తన సేవలు అవసరమైనప్పుడు అందిస్తానని పార్టీ సారధ్య బాధత్యల నుంచి తప్పుకున్నాడాయన. ఆపై అనారోగ్యంతో ఆయన వీల్చైర్కే పరిమితం అయ్యారు.
ఫిబ్రవరి 11, 2007.. పంజాబ్లో జరిగిన ఓ బహిరంగ సమావేశం. బీజేపీ టికెట్తో అమృత్సర్ నుంచి లోక్ సభ స్థాన ఉప ఎన్నిక కోసం నవజోత్ సింగ్ సిద్దూ పోటీకి దిగాడు. ఆ ప్రచార సభకు ప్రధాన ఆకర్షణ ఎవరో కాదు.. మాజీ ప్రధాని వాజ్పేయి. చాలా గ్యాప్ తర్వాత ఆయన ఓ బహిరంగ సభకు వస్తుండడంతో వేలమంది ఆ సభకు హాజరయ్యారు. టెంట్ల కింద జనం కిక్కిరిసి పోవడంతో.. బయట ఉండేందుకు వీలుగా సుమారు 10 వేల మందికి గొడుగుల్ని అందజేసింది బీజేపీ కమిటీ. కుర్చీలోనే కవితతో మొదలుపెట్టిన ఆయన ఉపన్యాసాన్ని .. ఎలాంటి కోలాహలం లేకుండా ఆసక్తిగా తిలకించారు ఆ జనం. ఆ రాజకీయ ఉద్దండుడి చివరి సభ అదేనని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.
చలించిన పోయిన మీడియా ప్రతినిధులు
ఎంతటి విపత్కర పరిస్థితినైనా జర్నలిజం క్యాష్ చేసుకుంటుందనే ఒక అపవాదు ఉంది. అందుకు తగట్లు కొందరు జర్నలిస్టులు ప్రవర్తించడమే అందుకు కారణం. సాధారణంగా.. నేతలను ఎన్నిరకాలుగా వీలైతే అన్నిరకాలుగా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయడం.. ఇరకాటంలో పడేయడం జాతీయ మీడియా చానెల్స్ జర్నలిస్టులకు వెన్నతో పెట్టిన విద్యం. కానీ, వాజ్పేయి విషయంలో మాత్రం వాళ్లు అలా చేయలేకపోయారు.
2007, డిసెంబర్ 25న పుట్టినరోజు సందర్భంగా కొందరు జర్నలిస్టులు వాజ్పేయిను కలవాలనుకున్నారు. ‘2009లో మరోసారి రాజకీయ పోరాటానికి ఆయన సిద్ధమేనా? ప్రచారంలో అయినా పాల్గొంటారా? లేదంటే ఆరోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉంటారా? అద్వానీకి పగ్గాలు అప్పజెప్తారా? ఇలాంటి ప్రశ్నలతో ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేయాలనే ఉద్దేశంతో ఓ జర్నలిస్ట్ బృందం అపాయింట్మెంట్ కోసం ఎదురుచూశారు.
వాళ్ల అజెండాపై స్పష్టత లేని బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ దగ్గరుండి 10 మంది జర్నలిస్టులను విజయ్ మీనన్ మార్గ్లో ఉన్న వాజ్పేయి ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆయన అనారోగ్యంతో ఉన్నారు. అయినప్పటికీ కొద్దినిమిషాల మీటింగ్ అరేంజ్ చేయించాడు హుస్సేన్. లోపలికి వెళ్లిన జర్నలిస్టులు.. వాజ్పేయి చూడగానే ఆశ్చర్యపోయారు.
ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే వాజ్పేయి.. కుర్చీలో కూర్చుకుని పాలిపోయిన ముఖంతో కదల్లేని స్థితిలో కనిపించేసరికి షాక్ తిన్నారంతా. చుట్టూ చేరి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. బదులుగా ‘నమస్కార్’ అనే మాట మాత్రమే వచ్చింది ఆయన నోటి నుంచి. అంతే.. వాజ్పేయి పరిస్థితి అర్థం చేసుకుని అంతా బయటకు వచ్చేశారు.
ఇంటికెళ్లి మరీ..
2009లో ఛాతీ ఇన్ఫెక్షన్తో ఎయిమ్స్లో చేరిన వాజ్పేయి..కాస్త కొలుకున్నాక ఇంటికే పరిమితం అయ్యారు. అనారోగ్యంతో 2009 ఎన్నికల క్యాంపెయిన్కు హాజరు కాలేదు. కానీ, ఆయన పేరు మీద లేఖలు మాత్రం విడుదల చేసింది బీజేపీ. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం అస్సలు సహకరించకపోవడంతో.. కీలక నేతలే అప్పుడప్పుడు ఒక్కొక్కరుగా ఆయన్ని ఇంటికి వెళ్లి ప్రైవేట్గా కలుస్తూ వచ్చారు.
వాజ్పేయికి కేంద్రం 2015లో భారతరత్న ప్రకటించింది. మార్చిన ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా వాజ్పేయి ఇంటికి వెళ్లి మరీ భారత రత్న అందుకున్నారు. సాధారణంగా పురస్కారాలను రాష్ట్రపతి భవన్లోనే అందుకోవాలి. కానీ, వాజ్పేయి ఆరోగ్య దృష్ట్యా, ప్రైవసీని కాపాడాలన్న ఉద్దేశంతో.. స్వయంగా రాష్ట్రపతే వెళ్లి అందించారు. చివరి రోజుల్లో.. ఆ రాజకీయ ఉద్దండుడు మతిమరుపు, కిడ్నీ సమస్యలు.. డయాబెటిస్, కదల్లేని స్థితిలో కనిపించిన ఫొటోలు చాలామందిని కదిలించివేశాయి. అందుకే.. 2018 ఆగస్టు 16వ తేదీన మరణించేంతవరకు ఆయన్ని మీడియా కంటపడకుండా జాగ్రత్తగా చూసుకున్నారు.
ఇవాళ భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి


