విజయ్‌ బ్రో.. మీ పాలన చూస్తుంటే భయమేస్తోంది..! | DMK MP Raja Fire On TVK Vijay | Sakshi
Sakshi News home page

విజయ్‌ బ్రో.. మీ పాలన చూస్తుంటే భయమేస్తోంది..!

Jun 3 2026 7:50 AM | Updated on Jun 3 2026 11:22 AM

DMK MP Raja Fire On TVK Vijay

సాక్షి, చెన్నై : తమిళనాడు సీఎం విజయ్‌  తిరుచ్చి పర్యటనలో డీఎంకేను లక్ష్యంగా చేసుకుని చేసిన ఘాటు వ్యాఖ్యలపై డీఎంకే ఎంపీ ఎ రాజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చెన్నైలోని అన్నా అరివాలయ మంగళవారం పార్టీ సీనియర్‌నేత ఆర్‌ఎస్‌ భారతీతో కలిసి  మీడియాతో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి విజయ్‌ వైఖరిని, పరిపాలనా పరిణితిని తీవ్రంగా ఎండగట్టారు. అసెంబ్లీలో చూస్తే విచారంగా, అలసటతో, తడబాటుగా, నిస్సహాయతతో కనిపించే సీఎం విజయ్‌.. తిరుచ్చి సభకు వెళ్లేసరికి అంత ఉత్సాహంగా, వ్యంగ్యంగా ఎలా మాట్లాడగలిగారు? ఆ స్క్రిప్ట్‌ రాసిచ్చింది ఎవరు?‘ అని రాజా ప్రశ్నించారు. 

మోదీ ముందు ఎందుకు నోరు విప్పలేదు: 
తాను కూర్చున్న సీఎం పదవికి తగినట్లు కాకుండా, తన స్థాయిని తగ్గించుకుని విజయ్‌ సినిమా డైలాగులు వల్లిస్తుండటం హాస్యాస్పదంగా ఉందన్నారు.  ప్రధాని మోదీని ఢిల్లీలో కలిసినప్పుడు కేవలం 10 నిమిషాలే కదా సమయం ఇచ్చారు... ’విజయ్‌ బ్రో’.. అప్పుడు ప్రధాని ముందు మీ శౌర్యం ఏమైంది?, అక్కడ ఎందుకు మాట్లాడకుండా వచ్చారు?, వచ్చాక కనీసం ప్రెస్‌మీట్‌ కూడా పెట్టకుండా ఎందుకు వెళ్లిపోయారు? అని రాజా నిలదీశారు. 

పాలనపై అవగాహన లేదు 
రైతుల సమస్యలు, ఎన్నికల మేనిఫెస్టోపై విజయ్‌ ప్రభుత్వాన్ని రాజా తప్పుపట్టారు. రిజర్వు బ్యాంక్‌  మార్గదర్శకాలు లేకుండా పంట రుణాలను పూర్తిగా మాఫీ చేయడం సాధ్యం కాదన్న  కనీసం ఈ ప్రాథమిక విషయం కూడా తెలియకుండానే 2026 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేశారా? అని ప్రశ్నించారు.  పలు అంశాలను ప్రస్తావిస్తూ, ఈ విషయాల్లో టీవీకే ప్రభుత్వం తన స్టాండ్‌ ఏంటో చెప్పడం లేదని మండి పడ్డారు.స్టాలిన్‌ సీఎంగా  ఉన్నంత వరకే మేఘదాతు సమస్య,  విజయ్‌ ఒక లెక్కే కాదని కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్‌ అంటుంటే.. దానికి తమరి  ప్రభుత్వం ఎందుకు బదులివ్వడం లేదు? అని ప్రశ్నించారు.

నిద్ర పట్టడం లేదు.. 
రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య వస్తే ఇప్పటికీ స్టాలిన్‌  కారణం అంటున్నారని మండి పడ్డారు. విజయ్‌ బ్రో.. మీ పాలన చూస్తుంటే భయమేస్తోంది, రాత్రిళ్లు నిద్ర రావడం లేదు. మనం అసలు ఎటు వైపు వెళ్తున్నామో అర్థం కావడం లేదు. ప్రభుత్వానికి ఎలాంటి దీర్ఘకాలిక ప్రణాళికలు లేవు, డీఎంకే ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి అని హితవు పలికారు. డీఎంకే, అన్నాడీఎంకే కూటమి ఊహాగానాలపై స్పందిస్తూ, పార్టీలోని రెండు, మూడో శ్రేణి నాయకులు ఏవైనా మాట్లాడి ఉండవచ్చు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు అందరికీ ఉంది.

 కానీ తమ  పార్టీ అధినేత తుది నిర్ణయం ఏంటి? తాము అధికారికంగా ఎగ్జిక్యూటివ్‌ లేదా జనరల్‌ కౌన్సిల్‌ సమావేశాలు పెట్టి తీర్మానాలు చేశామా? లేదు కదా‘ అని స్పష్టం చేశారు. వీసీకే తిరుమాపై  అమితమైన ప్రేమ ఉందని,  ప్రేమ ఉన్నచోటే కోపం వస్తుంది. కాంగ్రెస్‌ లేదా కమ్యూనిస్టులపై తమకు అంతగా కోపం రాదు. ఇది కేవలం ఒకే కూటమిలోని సోదరుల మధ్య వచ్చిన చిన్నపాటి అభిప్రాయ భేదం  మాత్రమే. ఇది శాశ్వతం కాదు అని ఆ. రాజా తేల్చిచెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement