
టేకాఫ్, ల్యాండింగ్ మధ్య గాల్లో ప్రయాణికుల ప్రాణాలు
ఢిల్లీ, ముంబై ఎయిర్పోర్టుల్లో బయటపడ్డ నిర్వహణ లోపాలు
అహ్మదాబాద్ విషాదం తర్వాతా మారని పరిస్థితి
డీజీసీఏ సేఫ్టీ ఆడిటింగ్లో వెల్లడైన వాస్తవాలు
సాక్షి, న్యూఢిల్లీ: విమానసంస్థల నిర్లక్ష్యం, విమానాశ్రయాల నిర్వహణ తీరుపై కళ్లు చెదిరే వాస్తవాలు వెలుగు చూశాయి. అహ్మదాబాద్లో ఎయిరిండియా డ్రీమ్లైనర్ విషాదం నేపథ్యంలో ఈనె 20, 21వ తేదీల్లో పౌరవిమాన యాన డైరెక్టరేట్ జనరల్(డీజీసీఏ) దేశంలోనే అత్యంత రద్దీ అయిన ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో సేఫ్టీ ఆడిటింగ్ చేపట్టింది. ఒక విమానయాన సంస్థకు చెందిన విమానం టైర్లు పూర్తిగా అరిగిపోయినా దాన్ని అలాగే టేకాఫ్ చేయిస్తున్నట్లు గుర్తించింది.
వెంటనే ఆ విమానాన్ని నిలిపివే యాలని అక్కడికక్కడే ఆదేశాలిచ్చింది. ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేసి ఇలాంటివే పలు లోపాలు డీజీసీఏ ఆడిట్ సమ యంలో అధికారుల దృష్టికి వచ్చాయి. అహ్మదాబాద్లో ఘోర విషాదం జరిగిన తర్వాత కూడా దేశీయ విమా నాయాన సంస్థల నిర్వహణ తీరు మారకపోవడంపై డీజీసీఏ తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది.
నిబంధనలు బేఖాతరు...
ఒక ఎయిర్పోర్టులో రన్వేపై ఉండే సెట్టర్ లైన్ మార్కింగ్ కనిపించని విషయాన్ని అధికారులు ఆడిట్లో గుర్తించారు. పైలట్లకు ఈ మార్కింగ్ స్పష్టంగా కనిపించకుంటే రన్వేపై ల్యాండింగ్ చేస్తున్నప్పుడు విమానం ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే, విమాన సంస్థలు పలురకాల డేటాను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. కానీ, చాలావరకు విమానయాన సంస్థలు గత మూడేళ్లుగా అవసరమైన డేటాను అప్డేట్ చేయలేదని తెలిసింది. విమానాశ్రయం లోపల స్పీడ్ గవర్నర్లు లేకుండానే చాలా వాహనాలు నడుస్తున్నట్లు, గ్రౌండ్ హ్యాండ్లింగ్లో కూడా చాలా లోపాలు ఉన్నట్లు ఆడిట్లో గుర్తించారు.
విమానం ఒకటైతే.. శిక్షణ మరొకటి...
ఒక విమానం నడపడానికి పైలట్కు సిమ్యులేటర్ శిక్షణ ఇస్తారు. పైలట్ ఆ విమానాన్ని నడపడానికి, అందులోని కమాండ్లను అర్థం చేసుకోవడానికి ఈ శిక్షణ ఇస్తారు. అయితే, విమానం ఒకటైతే పైలట్కు శిక్షణ ఇచ్చే సిమ్యులేటర్ ఇంకొకటని, అది ఆ విమానం కాన్ఫిగరేషన్తో సరిపోలలేదని సేఫ్టీ ఆడిట్లో వెల్లడైంది. దీంతో, విమాన ప్రయాణంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే పైలట్కు దిక్కుతోచని స్థితి తప్పదని తేలింది.
ఇంజనీర్లు కూడా లేరు
విమానం నిర్వహణ సమయంలో ఇంజనీర్లు కొన్ని ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ మాన్యువల్లను పాటించడం లేదని కూడా ఈ ఆడిట్లో తేలింది. విమానంలో ఏమైనా లోపాలు తలెత్తితే వాటిని సరిచేయడానికి చాలా చోట్ల ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీర్లు లేరని గుర్తించారు. విమానానికి సబంధించిన మరమ్మతుల రిపోర్ట్ను టెక్నికల్ లాగ్ పుస్తకంలో నమోదు చేయడంలేదని తేలింది. ఈ రికార్డును తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్న విషయాన్ని సైతం డీజీసీఏ సేఫ్టీ ఆడిట్ బృందం గుర్తించింది.