బడ్జెట్‌ 2021: చైనా దూకుడుకు చెక్‌ | Defence Budget 7.4% hike due to border tensions | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ 2021: చైనా దూకుడుకు చెక్‌

Feb 1 2021 4:34 PM | Updated on Feb 1 2021 8:15 PM

Defence Budget 7.4% hike due to border tensions - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌లో అత్యధిక కేటాయింపులు ఎప్పుడు రక్షణ శాఖకే ఉంటాయి. తాజాగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో కూడా రక్షణ శాఖకు భారీగా కేటాయింపులు వచ్చాయి. 15 ఏళ్లలో లేనట్టు ఈసారి కేటాయింపులు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల తెలిపారు. మొత్తం రక్షణ రంగానికి రూ.4,78,195.62 కోట్లు కేటాయించారు. ఇందులో మూలధన వ్యయం రూ.1.35 ల‌క్ష‌ల కోట్లు ఉంది. గ‌తేడాదితో పోలిస్తే మూల‌ధ‌న వ్య‌యం 19 శాతం పెరగడం గమనార్హం. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రక్షణ రంగానికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చింది. దీంతో సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేయడం.. సైన్యానికి అధునాతన ఆయుధాలు కల్పించడంతో వారికి సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ఈ నిధులు వెచ్చించనున్నారు. సరిహదుల్లో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేలా బడ్జెట్లో నిధులు కేటాయింపులు జరిపారు. (బడ్జెట్‌ 2021: ధరలు పెరిగేవి.. తగ్గేవి! )

ఈ కేటాయింపులపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ​ సింగ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్‌ చేశారు. ‘‘2021-22 ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగానికి రూ.4.78 లక్షల కోట్ల కేటాయింపుతో పాటు మూలధన వ్యయం రూ.1.35 ల‌క్ష‌ల కోట్లు ఇచ్చిన ప్రధానమంతి, ఆర్థిక మంత్రికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. 15 ఏళ్ల తర్వాత మూలధన వ్యయంలో 19 శాతం పెంపు జరిగింది’’ అని ట్విట్టర్‌లో రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు.రక్షణ రంగానికి గతేడాది కేటాయింపులు పరిశీలిస్తే రూ.3.62 లక్షల కేటాయింపులు జరగ్గా ఈ ఆర్థిక సంవత్సరం రూ.4,78,195.62 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే 7.4 శాతం పెరిగింది. ఇక ఆయుధాల కొనుగోలు, మరమ్మతులకు గతేడాది రూ.1,13,734 కోట్లు ఉండగా ఈసారి 2021-22 ఆర్థిక సంవత్సరానికి 18 శాతం పెంపుతో రూ.1,35,060 కోట్లు కేటాయింపులు చేశారు.

ఈ నిధులతో ముఖ్యంగా చలికాలంలో లడ్డాఖ్‌లో50 వేల భద్రతా దళాలకు సౌకర్యాల మెరుగు చేయనున్నారు. అయితే ఈ బడ్జెట్‌ కేటాయింపులు పక్క దేశం చైనా కన్నా చాలా తక్కువ. చైనా బడ్జెట్‌ పరిశీలిస్తే 2014-19 కాలంలో 261.11 బిలియన్‌ డాలర్లు కేటాయించింది. భారత్‌ కేవలం 71.1 బిలియన్‌ డాలర్లు కేటాయించడం గమనార్హం. ఇక మన దాయాది దేశం 10.3 బిలియన్‌ డాలర్లు కేటాయించింది. ప్రతి సంవత్సరం రక్షణ రంగానికి బడ్జెట్‌ కేటాయింపులు భారత్‌ పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈసారి బడ్జెట్‌లో రక్షణకు అత్యధిక కేటాయింపులు జరిగాయి. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement