కరోనా ఉధృతి: ఆరోగ్య మంత్రి కీలక ప్రకటన

COVID-19: Facing vaccine shortage enough for 3 days:  Health Minister - Sakshi

వ్యాక్సిన్ల  కొరత, ఇక మూడు రోజులకే

సాక్షి, ముంబై: ఒకవైపు దేశంలో కరోనా వైరస్‌ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతూ వణుకు పుట్టిస్తున్నాయి.  ప్రధానంగా మహారాష్ట్రలో కరోనా ఉధృతి ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. మరోవైపు   రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే  కీలక వ్యాఖ్యలు  చేశారు.  బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో వ్యాక్సిన్లు అయిపోతున్నాయంటూ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుతం 14 లక్షల వ్యాక్సిన్ మోతాదులు ఉన్నాయని, ఇవి రాబోయే మూడు రోజులకు సరిపోతాయని వెల్లడించారు. దీనిపై కేంద్రానికి సమాచారం అందించామని, వారానికి 40 లక్షల టీకాలు  కావాలని కేంద్రాన్ని కోరామని మంత్రి తెలిపారు.  (అంబానీ కుమారుడు సంచలన వ్యాఖ్యలు)

కేంద్రం మాకు టీకాలు ఇవ్వడం లేదని చెప్పలేం గానీ, వ్యాక్సిన్ల పంపిణీ వేగం నెమ్మదిగా ఉందని వ్యాఖ్యానించారు. చాలా వ్యాక్సిన్‌ కేంద్రాలలో తగినంత వ్యాక్సిన్లు లేవు. వ్యాక్సిన్లు లేక ప్రజలను తిరిగి పంపించాల్సి వస్తోందన్నారు.  20-40 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి తప్పనిసరిగా ప్రాధాన్యతపై టీకాలు వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని రాజేష్ తోపే తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 12 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోందని, ఏడు టన్నులకు పైగా ఆక్సిజన్ వినియోగిస్తున్నామని ఆరోగ్య మంత్రి చెప్పారు. దీంతోపాటు సమీప రాష్ట్రాల నుండి ఆక్సిజన్ సరఫరా చేయాలని కోరామనీ, అవసరమైతే, ఆక్సిజన్‌ను ఉపయోగించే పరిశ్రమలను మూసివేస్తాం కాని వైద్య ఆక్సిజన్ సరఫరాను ప్రభావితం  కానివ్వమని టోప్  ప్రకటించారు.

మహారాష్ట్రలో ఇప్పటివరకు దాదాపు 82 లక్షల మందికి టీకాలు వేయగా, మహారాష్ట్రకు 1.06 కోట్ల మోతాదు లభించిందని, అందులో 88 లక్షల మోతాదులను వాడగా, వృధా మూడు శాతం వద్ద ఉందని మంగళవారం ఒక అధికారిక ప్రకటలో వెల్లడించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో మంగళవారం రోజు 55,469 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 31,13,354 కు, మరణాలు 56,330 కు చేరుకున్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ముంబైలో కొత్తగా 10,040 కేసులు, 32 మరణాలు నమోదయ్యాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top