మధ్యప్రదేశ్లోని అంకిత్ సేవాధామ్ ఆశ్రమంలో 11 మంది దివ్యాంగులైన పిల్లల మృతిపై ఆరాష్ట్ర హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మరణాలపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోరుతూ ఆశ్రమ నిర్వాహకులతో పాటు జిల్లా ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది.
ఉజ్జయినిలోని అంకిత్ సేవానంద్ ఆశ్రమంలో దివ్యాంగులు ( మైనర్లు) మరణాన్ని ఆ రాష్ట్ర కోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై రెండు వారాల్లోగా స్పష్టమైన వివరాలు ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలఫ్మెంట్ కమిషనర్లతో పాటు ఉజ్జయిని కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఆశ్రమ నిర్వాహాకులకు కోర్టు నోటీసులందించింది.
అసలేం జరిగింది?
ఉజ్జయిని అంబోడియాలోని అంకిత్ సేవాధామ్ ఆశ్రమంలో గత 51 రోజులుగా 11 మంది పిల్లలు అనారోగ్యకారణాలతో మృతిచెందారు. గతేడాది నవంబర్ 10 నుంచి ఈ ఏడాది జనవరి 10 వరకూ ఈ మరణాలు సంభవించాయి. చనిపోయిన పిల్లల వయసు 10-18 సంవత్సరాల మధ్యలో ఉంది. అయితే ప్రస్తుతం కూడా 50 మంది తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
చాలా మంది ఆశ్రమానికి వివిధ రకాలైన సమస్యలతోనే వస్తారని వారిలో చాలామందికి నడవడం, తినే పరిస్థితిలో కూడా ఉండరని అన్నారు. ప్రస్తుతం అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో చాలా మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఆశ్రమం డైరెక్టర్ సుధీర్ భాయ్ గోయల్ తెలిపారు.
అయితే ఏడాదిన్నర క్రితం ఇండోర్లోని పురుష్ ధామ్ ఆశ్రమంలో ఈ పిల్లలు ఆశ్రయం పొందేవారు. ఆ సమయంలో ఇదే రీతిలో అక్కడ మరణాలు సంభవించడంతో ప్రభుత్వం ఆశ్రమం గుర్తింపు రద్దు చేసి అంకిత్ సేవాధామ్ ఆశ్రమానికి పిల్లలను తరలించింది. ఇప్పుడు ఇక్కడే ఇదే తరహా మరణాలు జరగడం ఆందోళనకు గురిచేస్తుంది. అయితే దీనిని సీరియస్గా తీసుకున్న హైకోర్టు మార్చి 12లోగా నివేదిక అందజేయాలని ఆదేశించింది.


