Jodhpur: పండుగ వేళ టెన్షన్‌.. టెన్షన్‌.. ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియా బంద్‌

Clashes Over Raising Religious Flags In Jodhpur - Sakshi

జైపూర్‌: రాజ‌స్థాన్‌లోని సోమవారం రాత్రి ఉద్రిక్తకర పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రెండు వర్గాల మధ్య వాగ్వాదం పెరిగి చివరకు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. 

వివరాల ప్రకారం.. జోధ్‌పూర్‌ జిల్లాలోని బాల్‌ముకంద్‌ బిస్సా సర్కిల్‌లో ఓ వర్గం జెండాలను తొలగించి మరో వర్గానికి చెందిన జెండాలను పాతడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ప్రార్థ‌న‌ల కోసం ఏర్పాటు చేసిన లౌడ్‌స్పీక‌ర్ల‌ను కొంద‌రు తొల‌గించారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తకరంగా మారి రెండు వ‌ర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి.

సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాల యువకులను చెదరగొట్టారు. ఈ ఘర‍్షణలో కొందరు యువకులు, నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో భారీ సంఖ్యలో పోలీసు బలగాలు అక్కడకు చేరుకున్నాయి. కాగా, ఈ ఘటనపై సీఎం అశోక్‌ గెహ్లాట్‌ స్పందిస్తూ ప్రజలందరూ శాంతి, సామరస్యంతో ఉండాలని కోరారు. అలాగే, ముందు జాగ్రత్త చర్చగా జిల్లాలో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, ఇత‌ర సోష‌ల్ మీడియాను, మొబైల్‌ డేటాతో​ పాటుగా ఇంటర్నెట్‌ సేవలను సైతం నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. 

ఇది కూడా చదవండి: సంక్షోభంలో బొమ్మై ప్రభుత్వం?.. రంగంలోకి అమిత్‌ షా

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top