బెంగాల్‌ రాజకీయాల్లో పెను సంచలనం | Big Twist In West bengal TMC Rebel Episode | Sakshi
Sakshi News home page

బెంగాల్‌ రాజకీయాల్లో పెను సంచలనం

Jun 3 2026 11:09 AM | Updated on Jun 3 2026 11:39 AM

Big Twist In West bengal TMC Rebel Episode

పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో భారీ చీలిక చోటు చేసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే రీటా బ్రతా బెనర్జీ.. ఇవాళ అసెంబ్లీలోకి వెళ్లి తనకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ ప్రకటించారు. ఈ పరిణామంతో తర్వాత ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది.

టీఎంసీ సస్పెండెడ్‌ ఎమ్మెల్యే రీటా బ్రతా బెనర్జీ.. పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేల మద్దతు ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సుమారు 50 మంది ఎమ్మెల్యేలు తనకు మద్దతు తెలుపుతున్నారని, దీంతో కొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తిరుగుబాటు వర్గం ఆయనను ప్రతిపక్ష నేత (LoP)గా నిలబెట్టే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. దీంతో అసెంబ్లీలో అధికార టీఎంసీకి వ్యతిరేకంగా కొత్త శక్తి రూపుదిద్దుకుంటుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది.

బెంగాల్‌లో టీఎంసీ దారుణ ఓటమి తర్వాత.. ఆ పార్టీలో మమతా బెనర్జీ నాయకత్వంపై అసంతృప్తి బయటపడుతోంది. ఇక ఇటీవల మమతా బెనర్జీ అధ్యక్షతన జరిగిన టీఎంసీ కీలక సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంతో అది దాదాపు ఖాయమైంది. అదే సమయంలో అసంతృప్త ఎమ్మెల్యేలంతా విడిగా ఓ హెటల్‌లో సమావేశం అయ్యారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రీటా బ్రతా బెనర్జీ చేసిన తాజా వ్యాఖ్యలు టీఎంసీ అంతర్గత రాజకీయాలను మరింత ఉద్రిక్తంగా మార్చాయి. పార్టీ చీలిక నిజంగానే జరుగుతోందా? లేదంటే ఇది తాత్కాలిక అసంతృప్తి మాత్రమేనా? అన్నది బెంగాల్‌ రాజకీయాల్లో ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.

మహా సీన్‌ రిపీటా?
టీఎంసీలో కొనసాగుతున్న అంతర్గత అసంతృప్తి మరింత పెరిగితే పార్టీపై మమతా బెనర్జీ పట్టు బలహీనపడే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల సంఖ్యాబలం కీలకంగా మారితే.. పార్టీ ఆమె చేజారి పోవచ్చని చెబుతున్నారు. ఈ క్రమంలో గతంలో మహారాష్ట్ర రాజకీయాలు ఉదాహరణగా చెబుతున్నారు.

2022లో మహారాష్ట్రలోని రాజకీయ సంక్షోభం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఉద్ధవ్‌ థాక్రే నేతృత్వంలోని శివసేనలో మొదలైన అసంతృప్తి.. ఏక్‌నాథ్‌ షిండే వర్గం భారీగా ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడంతో అసెంబ్లీలో మెజారిటీ సమీకరణం మారిపోయింది. చివరికి పార్టీ గుర్తు, నాయకత్వం కూడా మారిన పరిణామం రాజకీయంగా పెద్ద మలుపుగా నిలిచింది. రీటా బ్రతా బెనర్జీ చేసిన 50 మంది ఎమ్మెల్యేల మద్దతు వ్యాఖ్యలు ఆ దిశగా సంకేతాలిస్తున్నాయనే చెప్పొచ్చు. మహారాష్ట్ర శివసేన సంక్షోభం తరహాలో టీఎంసీలో కూడా ఎమ్మెల్యేల మద్దతు సమీకరణం మారితే, ప్రస్తుత అసంతృప్తి పెద్ద రాజకీయ సంక్షోభంగా మారే అవకాశం ఉందని మమతను విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. 

ఎవరీ రీటా బ్రతా బెనర్జీ..
రీటా బ్రతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో వివాదాలతో పాటు వేగంగా ఎదిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. కోల్‌కతా సౌత్ పాయింట్ హైస్కూల్, అసుతోష్ కాలేజీలో చదువుకున్న ఆయన 2000ల ప్రారంభంలో విద్యార్థి రాజకీయాల ద్వారా ముందుకు వచ్చారు. స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI)లో కీలక నాయకుడిగా ఎదిగి, సీపీఎం యువజన విభాగంలో దాదాపు ఎనిమిదేళ్లు క్రియాశీలంగా పనిచేశారు. ఆ సమయంలోనే ఆయనను సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి‌కు దగ్గరగా ఉన్న యువ నాయకుడిగా భావించేవారు.

తరువాత 34 ఏళ్లకే సీపీఎం ఆయనను రాజ్యసభకు పంపడం అప్పట్లో పెద్ద సంచలనం. అయితే 2017లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలతో సీపీఎం ఆయనను తొలుత సస్పెండ్ చేసి, తరువాత పూర్తిగా బహిష్కరించింది. అదే సమయంలో పార్టీ నాయకత్వంపై ఆయన బహిరంగ విమర్శలు చేయడం, అంతర్గత విభేదాలు తీవ్రమవ్వడం ఈ చర్యకు కారణమయ్యాయి. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన ఆయన, పార్టీ ట్రేడ్ యూనియన్ విభాగంలో కీలక బాధ్యతలు చేపట్టి తిరిగి రాజకీయంగా పుంజుకున్నారు.

టీఎంసీలో చేరిన తర్వాత కూడా ఆయన ప్రయాణం వివాదాల నుంచి పూర్తిగా బయటపడలేదు. తాజాగా ఎమ్మెల్యే సంతకాల ఫోర్జరీ ఆరోపణల వివాదం ఆయనను మళ్లీ వార్తల్లోకి తెచ్చింది. పార్టీ కమ్యూనికేషన్‌లో తప్పుదారి పట్టించే సంతకాలు ఉన్నాయని ఆయనతో పాటు మరో ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేయడంతో, పార్టీ చర్యలు తీసుకుని ఇద్దరినీ సస్పెండ్ చేసింది. ఈ పరిణామాల మధ్య.. 

మమతకు దగ్గరేనా?
తాజాగా ఆయన “50 మంది ఎమ్మెల్యేల మద్దతు” ఉందని చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. రీటా ఒక్కసారిగా రెబల్ వర్గానికి కేంద్రబిందువుగా మారారు. అయితే ఈ మద్దతు ఎంతవరకు వాస్తవమో ఇంకా అధికారికంగా ధృవీకరణ కాలేదు. రాజకీయ విశ్లేషకుల ప్రకారం, ఇలాంటి క్లెయిమ్స్ సాధారణంగా అంతర్గత అసంతృప్తిని ఒక రాజకీయ శక్తిగా మార్చే ప్రయత్నంగా కూడా ఉండవచ్చు. అలాగే..

మాజీ సీఎం మమతా బెనర్జీతో ఆయన సంబంధంపై చూస్తే.. ప్రారంభంలో పార్టీ వేదికలో భాగంగా ఉండటం వల్ల ఒక స్థాయి సాన్నిహిత్యం, రాజకీయ సమన్వయం ఉండే అవకాశం ఉంది. కానీ పార్టీ నిర్ణయాలపై భిన్న అభిప్రాయాలు పెరిగిన తర్వాత ఆ దూరం పెరిగినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయనను మమతకు “దగ్గర నేత”గా కాకుండా, పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా నిలిచిన రెబల్ నేతగా మాత్రమే చూస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement