అసాధ్యాలను సుసాధ్యం చేసిన మోదీ: అమిత్‌ షా

Be it Ram temple or Article 370, Modi govt made possible says Amit Shah - Sakshi

సిమ్లా: ఆర్టికల్‌ 370 రద్దు, రామ మందిర నిర్మాణం సహా గతంలో అందరూ అసాధ్యమని భావించిన వాటిని నరేంద్ర మోదీ ప్రభుత్వం సుసాధ్యం చేసి చూపిందని హోం మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రం సిర్మౌర్‌ జిల్లాలో శనివారం జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో మంత్రి ప్రసంగించారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దవుతుందని మీలో ఎవరైనా ఊహించారా? అంటూ హాజరైన వారినుద్దేశించి ఆయన ప్రశ్నించారు.

జవహర్‌ లాల్‌ నెహ్రూ తీసుకువచ్చిన ఆర్టికల్‌ 370ను గురించి ఎవరైనా ప్రశ్నిస్తే కాంగ్రెస్‌ నాయకులు మిన్నకుండి పోతారని ఎద్దేవా చేశారు. అయోధ్యలో మందిర నిర్మాణం అసాధ్యమని కాంగ్రెస్‌ పెదవి విరిస్తే తాము బృహత్‌ రామాలయం పనులను ప్రారంభించామని చెప్పారు. ‘వంశ రాజకీయాలకు ప్రధాని మోదీ ముగింపు పలికారు. ఢిల్లీలోని రాజ్‌పథ్‌కు కర్తవ్యపథ్‌గా పేరు పెట్టి, సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు’అని అమిత్‌ షా అన్నారు. ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థల్లో 11వ స్థానంలో ఉన్న భారత్‌.. మోదీ నాయకత్వంలో ఐదో స్థానానికి చేరుకుందని ఆయన పేర్కొన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top