
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో కొలువైన కేదారనాథుడు శివరాత్రి పర్వదినాన భక్తులపై అనుగ్రహ వర్షం కురిపించాడు. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఏడాది కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరుచుకునే తేదీని ప్రకటించారు. రాబోయే మే 2న ఉదయం ఏడు గంటలకు వృషభ లగ్నంలో కేదార్నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి.
కేదార్నాథ్ ధామ్ తెరుచుకోవడంతోనే చార్ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. కేదార్నాథ్ ధామ్ దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ 12 జ్యోతిర్లింగాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. అవి గుజరాత్లోని సోమనాథ్- నాగేశ్వర్ ఆలయం, ఆంధ్రప్రదేశ్లోని మల్లికార్జున ఆలయం, మధ్యప్రదేశ్లోని మహాకాళేశ్వర, ఓంకారేశ్వర ఆలయం, ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయం, మహారాష్ట్రలోని భీమశంకర, త్రయంబకేశ్వర ఆలయం, ఉత్తరప్రదేశ్లోని కాశీ విశ్వనాథ ఆలయం, జార్ఖండ్లోని వైద్యనాథ ఆలయం, తమిళనాడులోని రామేశ్వరం, మహారాష్ట్రలోని ఘుష్మేశ్వర్ ఆలయం.
కేదార్నాథ్ ధామ్ ఉత్తరాఖండ్లోని నాలుగు ధామ్లలో ఒకటి. కేదార్నాథ్ ఆలయం రుద్రప్రయాగ జిల్లాలోని గౌరికుండ్కు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పురాతన ఆలయానికి సంబంధించిన ప్రస్తావన మహాభారత కాలంలోనే కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని ఆది గురు శంకరాచార్యులు 8-9 శతాబ్దాల మధ్యకాలంలో నిర్మించారని చెబుతారు.
ఇది కూడా చదవండి: Mahashivratri: జ్యోతిర్లింగాలలో మార్మోగుతున్న శివనామస్మరణలు