
రాష్ట్రపతి భవన్ ఉద్యానవనంలో ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 14 వరకు సందర్శకులకు అనుమతి
క్రీడాకారులకు ఆగస్టు 29న, ఉపాధ్యాయులకు సెప్టెంబర్ 5న ప్రత్యేక ప్రవేశం
అందరికీ ఉచిత ప్రవేశం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్ పరిధిలోని అమృత ఉద్యానంలో వేసవి పూల ప్రదర్శన ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 14 వరకు జరగనుంది. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకులకు ‘అమృత్ ఉద్యాన్’తోటను సందర్శించవచ్చు. సాయంత్రం 5:15ల తర్వాత ప్రధాన ద్వారం దాటి లోపలికి అనుమతించబోమని రాష్ట్రపతి భవన్ సచివాలయం తెలిపింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. తోట నిర్వహణ నిమిత్తం ప్రతి సోమవారం అమృత్ ఉద్యాన్కు సెలవు ప్రకటించారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 29వ తేదీన క్రీడాకారులకు, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ ఐదో తేదీన ఉపాధ్యాయులకు ప్రత్యేక ప్రవేశం కల్పిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
ఆన్లైన్ బుకింగ్ లేదా కియోస్క్ ద్వారా నమోదు
సందర్శకులు నార్త్ అవెన్యూ రోడ్లోని 35వ నంబర్ ద్వారం ద్వారా ఉద్యనవనంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ప్రవేశం ఉచితమే అయినా ముందస్తుగా రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్సైట్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. visit. rashtrapatibhavan. వెబ్సైట్ ద్వారా టికెట్ను బుక్ చేసుకోవచ్చు. ముందస్తు ప్రణాళికలేకుండా వచ్చే సందర్శకులు గేట్ వద్ద ఏర్పాటు చేసిన సెల్ఫ్ సరీ్వస్ కియోస్్కల ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఉద్యానంలోకి మొబైల్ ఫోన్లు, ఎల్రక్టానిక్ కీలు, పర్సులు, హ్యాండ్బ్యాగ్లు, నీళ్ల సీసా, బేబీ మిల్క్ బాటిళ్లు, గొడుగులు మాత్రమే తీసుకెళ్లే వీలుంటుంది. ఇతర వస్తువులపై నిషేధం విధించారు.
కొత్తగా బాబ్లింగ్ బ్రుక్
సందర్శనలో భాగంగా మొత్తం తోటలో బాలవాటిక, ఔషధ వనం, బొన్సాయ్ తోట, సెంట్రల్ లాన్, లాంగ్ గార్డెన్, వలయాకార తోట వంటి ఎన్నో ప్రాంతాలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. ప్రతి గార్డెన్లో కీలకమైన మొక్క, చెట్టు వద్ద ఈసారి క్యూఆర్ కోడ్లను ఏర్పాటుచేశారు. ఈ మొక్క, చెట్లు విశిష్టత తెలియాలంటే ఆ క్యూఆర్ కోడ్ను స్మార్ట్ఫోన్తో స్కాన్ చేసి వివరాలు పొందొచ్చు. ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా రూపొందించిన ‘బాబ్లింగ్ బ్రుక్’సందర్శకులకు కొత్త అనుభూతిని అందించనుంది. ఇందులో భాగంగా నీటి ప్రవాహాలు, శిల్ప రూపకల్పనలతో కూడిన స్పాట్స్, స్టెప్పింగ్ స్టోన్లు, రిఫ్లెక్టింగ్ పూల్ ఉన్నాయి. మర్రి చెట్ల తోటలో పంచతత్వ ట్రైల్స్, రిఫ్లెక్సాలజీ మార్గాలు, ప్రకృతి శబ్దాల అనుభూతి కల్పించనున్నారు. వీటితో పాటు ఔషధ మొక్కలతో పాటు ప్లూమేరియా పుష్పజాతుల చెట్లు సందర్శకులను అలరించనున్నాయి.