మళ్లీ ఆస్పత్రిలో చేరిన అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ : కరోనావైరస్ నుంచి కోలుకొని ఇటీవల ఇంటికి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. సోమవారం రాత్రి ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలోని వైద్యుల బృందం అతని పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. (చదవండి : 24 గంటల్లో భారత్లో 55,079 పాజిటివ్)
గత మూడు రోజులుగా ఆయన శ్వాసకోస ఇబ్బందులతో, ఒంటి నొప్పులతో బాధపడుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ టెస్టులు జరపగా నెగిటివ్ వచ్చినట్టుగా వైద్యులు పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, ఆసుపత్రి నుంచే ఆఫీసు వ్యవహారాలు చక్కబెడుతున్నారని ప్రకటనలో తెలిపారు. కాగా, ఆగస్ట్ 2న అమిత్ షాకు కరోనా పరీక్షలో పాజిటివ్ వచ్చింది. వైద్యుల సూచనలతో ఆయన గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. అనంతరం కరోనా నుంచి కోలుకున్న ఆయన గత శుక్రవారం( ఆగస్ట్ 14) ఇంటికి వచ్చారు.