
అహ్మదాబాద్ విమానంలో ఎయిర్ హోస్టెస్ నగాన్తోయ్ శర్మ (21) కథ విన్న ఎవరికైనా కళ్లు చెమ్మగిల్లవలసిందే! మణిపురకు చెందిన ఈమె 19 ఏళ్లకే ఎయిర్ ఇండియాలో చేరింది. మంచిపేరు తెచ్చుకుంది. అసలు ఆమె ఉద్యోగంలో అనుకోకుండా చేరింది. ఆమె స్నేహితులు ఎయిర్ హోస్టెస్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళుతూ సరదాగా తనను కూడా వెంటబెట్టుకుని వెళ్లారు. ఎలాగూ అంతదూరం వచ్చాను కదా అని ఇంటర్వ్యూలో పాల్గొంది నగన్. ఆశ్చర్యం... ఆ ఉద్యోగం ఆమెను వెంటబెట్టుకుని వెళ్లిన స్నేహితులకు రాలేదు.
నగన్కు వచ్చింది. ‘ఇలా ఉద్యోగం వచ్చింది నాన్నా, ఏం చేయమంటావు’ అని అడిగింది. ‘మంచి సంస్థ... చక్కటి ఉద్యోగం. నీది పదిమందితో కలిసిపోయే స్వభావం కాబట్టి వెంటనే చేరు తల్లీ... అని క్షణం ఆలోచించకుండా చెప్పాను. చివరికి ఇప్పుడిలా...’ అంటూ ఆమె తండ్రి కన్నీళ్ల పర్యంతమవుతూ చెప్పారు. నగన్ ఉద్యోగంలో చేరిన రెండేళ్లకే అదే విమానంలో ప్రాణాలు కోల్పోవడం ఆమె కుటుంబ సభ్యులను, స్నేహితులనూ కలచి వేస్తోంది. ‘‘ప్రమాదం జరిగే రోజు పోద్దున 11.30 గం.కు ఫోన్ చేసి ‘నేనిప్పుడు లండన్ వెళ్తున్నాను. మళ్లీ మాట్లాడలేనేమో.. జూన్15న తిరిగి వస్తాను’ అని చెప్పింది. చివరికి ఆ మాటే నిజమైంది. ఆమె మాతో ఇంకెప్పటికీ మాట్లాడలేదు’’అని ఆమె సోదరి, కుటుంబ సభ్యులు విలపిస్తూ చెప్పారు.