వనపర్తి: రైతులు సాగునీటి కోసం అరిగోసపడేలా.. యూరియా కోసం క్యూలైన్లో నిలబడేలా.. పెట్టుబడి సాయం ఎగొట్టి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మునుపటి కాంగ్రెస్ పాలన తీసుకొచ్చారని.. ఇదేనా ఇందిరమ్మ పాలనా అని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ప్రశ్నించారు. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి తండ్రి మరణవార్త తెలుసుకొని శనివారం పరామర్శించేందుకు వచ్చిన ఆయన తిరుగు ప్రయాణంలో పెబ్బేరు మండలం గుమ్మడం, పెబ్బేరులోని విద్యుత్ సబ్స్టేషన్లను సందర్శించి విద్యుత్ సరఫరా లాగ్బుక్ను పరిశీలించారు. అనంతరం పెబ్బేరులోని సుభాష్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మాట్లాడుతూ.. వ్యవసాయానికి కేవలం ఐదారు గంటలు మాత్రమే సరఫరా ఇస్తున్నట్లు, రోజుకు పదిసార్ల కంటే ఎక్కువ కోతలు విధిస్తున్నట్లు రైతులు, లాగ్బుక్లో నమోదు చేసిన వివరాలతో స్పష్టమవుతోందన్నారు. తన రాజకీయ గురువు చంద్రబాబు కోసం వరద జలాలను వదిలేసి.. సకాలంలో మోటార్లు ఆన్ చేయలేదని, దీంతో ఆంధ్రాకు సాగునీరు.. తెలంగాణ ప్రాంత రైతులకు కరువును మిగిల్చారని ఆరోపించారు. ఆంధ్రా పాలకులు ముందుచూపుతో ఇప్పటికే వెలుగొండ, పొతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తరలించుకొని రిజర్వాయర్లు నీటితో నింపుకొంటున్నారన్నారు. మోటార్లు రెండ్రోజులు నడిస్తే వారం పాటు బంద్ చేసే కాంగ్రెస్ పాలకులకు రైతులపై ప్రేమ ఎలా ఉన్నట్లు అవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉత్పన్నమైన కరవు కాంగ్రెస్ పాలకుల పుణ్యమేనని.. ముందస్తు ఆలోచనతో కృష్ణా జలాలను మొదటిరోజు నుంచి ఒడిసిపట్టుకుని నిల్వ చేసుకొని ఉంటే ప్రస్తుతం పంటలకు కావాల్సిన సాగునీరు అందుబాటులో ఉండటంతో పాటు భూగర్భ జలాలు అడుగంటేవి కావన్నారు.
రైతుబీమాకు దిక్కులేదు..
రైతులకు ఆపత్కాలంలో సాయంగా ఉండేలా.. కేసీఆర్ రూపొందించిన రైతుబీమా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తోందని, ఇప్పటికింకా ఇన్స్యూరెన్స్ సంస్థలకు చెల్లించాల్సిన రూ.1,700 కోట్లు చెల్లించకుండా కాలయాపన చేస్తుండటంతో బీమా వర్తించడం లేదన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే ఆగమవుతారని 2023 జనరల్ ఎన్నికల్లో కేసీఆర్ ప్రతి ప్రచార సభలో చెప్పినా వినకుండా ప్రజలు ఓట్లు వేశారని.. దీంతో మళ్లీ విద్యుత్ కోతలు, యూరియా కష్టాలు, పెట్టుబడి సాయం కోసం ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పాలకులు నిషేధిత భూముల జాబితాలో రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఎకరాలను చేర్చి ప్రజలు, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. ఒక్క పెబ్బేరు మండలంలోనే సుమారు వెయ్యి ఎకరాలను ఉద్దేశపూర్వకంగా చేర్చారని ఆరోపించారు.
ఒక్క ఎకరా ఎండినా వదలం..
ప్రస్తుత వానాకాలంలో జూరాల ఆయకట్టులో సాగు చేసిన వివిధ రకాల పంటల్లో సాగునీరు అందక ఒక్క ఎకరా ఎండినా వదిలిపెట్టబోమని కేటీఆర్ హెచ్చరించారు. పంటలను కాపాడేందుకు కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి కనీసం 5 టీఎంసీల నీటిని విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో సాధ్యం కాదంటే రైతుల కోసం బీఆర్ఎస్ తరుఫున కర్ణాటక ప్రభుత్వంతో తాము సంప్రదింపులు చేస్తామన్నారు. కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.


