నివేదిక వచ్చాకే..
రెండేళ్లలో 900 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
● నేటికీ ఆగని దందా
● తాజాగా శనివారం ఆశన్పల్లిలో
పట్టుబడిన బియ్యం లారీ
● నమూనాలు సేకరణ.. నివేదికే ఆలస్యం
నారాయణపేట: జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ ర వాణాపై రెండేళ్లలో టాస్క్ఫోర్స్ పోలీసులు చేపట్టి న దాడుల్లో సుమారు 900 క్వింటాళ్లు పట్టుబడినట్లు అధికారులు చెబుతున్నారు. బియ్యం తరలింపుతో సంబంధం ఉన్న సుమారు 60 మందిపై కేసులు నమోదైనట్లు సమాచారం. నియంత్రణకు ప్రభు త్వం ఎన్ని వ్యవస్థలు తీసుకొచ్చినా పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతునే ఉంది. తాజాగా శనివారం దామరగిద్ద మండలం ఆశన్పల్లి రైస్మిల్లు దగ్గర బియ్యం లారీ పట్టుబడింది. అవి రేషన్ బియ్యమా..? లేక సీఎంఆర్ బియ్యమా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వ్యవస్థలో లోపాలే కారణమా..?
ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలోని 13 మండలాల పరిధిలో 301 రేషన్ దుకాణాలు, 1,72,075 రేషన్ కార్డులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మూడు నెలలకు కలిపి సుమారు 12,050 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నట్లు సమాచారం. భారీ మొత్తంలో బియ్యం ఒకేసారి అందుబాటులోకి రావడంతో అక్రమ రవాణాపై నిఘా మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది. పంపిణీ నుంచి లబ్ధిదారుడి ఇంటి వరకు, లబ్ధిదారుడి నుంచి తిరిగి మార్కెట్ దాకా ప్రతి దశలోనూ పర్యవేక్షణ ఉందా..? సాంకేతిక పరిజ్ఞానం, ఆన్లైనన్ ట్రాకింగ్ ఉన్నా బియ్యం పట్టుబడుతుండటం వ్యవస్థలోని లోపాలను ప్రశ్నిస్తోంది.
లారీ పట్టివేతతో కలకలం
గతంలో పౌరసరఫరాలశాఖ అధికారులు ఆశన్పల్లిలోని రైస్మిల్లుపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. తాజాగా శనివారం రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో అదే మిల్లు దగ్గర బియ్యంలోడ్తో ఉన్న లారీని గ్రామస్తులు గుర్తించి పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకొని బియ్యం నిల్వలను పరిశీలించి పూర్తి వివరాలు సేకరించి పౌరసరఫరాలశాఖ అధికారులకు తెలియజేశారు. వారు ఆదివారం బియ్యం నమూనాలు తీసుకొని పరీక్షలకు పంపించారు. నివేదిక వచ్చిన తర్వాతే రేషన్ బియ్యమా.. సీఎంఆర్ బియ్యమా అన్నది స్పష్టమవుతుందని అధికారులు చెబుతున్నారు.
లాట్నంబరే క్లూ..
ఈ వ్యవహారంలో బియ్యం సంచులపై ఉన్న లాట్నంబర్లు కీలక ఆధారంగా మారే అవకాశం ఉంది. లాట్నంబర్లను స్టాక్ రిజిస్టర్తో సరిపోల్చాలి. మిల్లు రికార్డులు, వే బిల్లు, వాహనం నంబర్, లోడింగ్ వివరాలు, గమ్యస్థానం.. ఇలా ప్రతి అంశాన్ని ఒకదానితో మరొకటి క్రాస్ చెక్ చేస్తేనే అసలు విషయం బయటపడుతుంది.
డీలర్ పాత్రపై అనుమానం..
దామరగిద్ద మండలానికి చెందిన ఓ రేషన్ డీలర్ పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ డీలర్ మూడునెలల కోటకు సంబంధించి ఓ వాహనంలో ఉన్న బియ్యం బస్తాలను మిల్లులోనే శనివారం వేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ వాహనాన్ని పట్టుకునేందుకు వెళ్లిన గ్రామస్తులకు లారీ కనిపించిందని తెలుస్తోంది.
ఆశన్పల్లి రైస్ మిల్లు వద్ద ఉన్న బియ్యం లారీ ప్రస్తుతం పోలీసుల ఆధీనంలో ఉంది. పౌరసరఫరాలశాఖ డీటీల ద్వారా బియ్యం నమూనాలు తీసి పరీక్షలకు పంపించాం. సివిల్ సప్లయ్ డీఎం నివేదిక వచ్చిన తర్వాత రేషన్ బియ్యమా.. సీఎంఆర్ బియ్యమా అన్నది తెలుస్తుంది. – బాలరాజు,
జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి


