నారాయణపేట: జిల్లాలోని నిరుపేద పిల్లలకు ఆధార్ నమోదు చేయించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీనియర్ సివిల్జడ్జి వింధ్యనాయక్ అన్నారు. బుధవారం జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటుచేసిన సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడారు. ఏ ఒక్కరికీ చట్టపరమైన గుర్తింపు లేదా హక్కులు, అర్హత కల్పించడమే లక్ష్యంగా ‘సర్వే ఫర్ ఆధార్ అండ్ యాక్సెస్ టు ట్రాకింగ్ అండ్ హోలిస్టిక్ ఇంక్లూజన్‘ కార్యక్రమం చేపట్టాలని జిల్లా సాథి కమిటీ సభ్యులకు సూచించారు. ఇటీవల జాతీయ న్యాయ సేవల అథారిటీ, రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ ఆదేశాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు సూచనల మేరకు జిల్లా సాథి కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కమిటీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా అనాథ పిల్లల జనన నమోదు, ఆధార్ నమోదుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ నుంచి తిరుపతయ్య, ఆధార్ మౌలిక సదుపాయాలు, నమోదు ప్రతినిధి అమరేంద్ర కృష్ణ, డీఈఓ గోవిందరాజులు, జిల్లా వైద్యాఆరోగ్యశాఖ నుంచి శైలజ, జిల్లా మహిళా, శిశుసంక్షేమశాఖ నుంచి జయ, పలు సంస్థల ప్రతినిధులు శివలీల, శ్వేత, న్యాయవాదులు రఘువీర్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ డ్రామా : బీజేపీ
నారాయణపేట రూరల్: అమలు సాధ్యంకాని బీసీ రిజర్వేషన్లు కేవలం కాంగ్రెస్ పార్టీ డ్రామా అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, మాజీ అధ్యక్షుడు పి.శ్రీనివాసులు విమర్శించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందన్నారు. 42శాతం బీసీ రిజర్వేషన్లు అని చెప్పిన ప్రభుత్వం.. అందులో స్పష్టంగా ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని పేర్కొనడాన్ని చూస్తే కాంగ్రెస్కు బీసీలపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. రాష్ట్ర జనాభాలో 12శాతం ఉన్న ముస్లింలకు 10శా తం రిజర్వేషన్లు ఇచ్చి, 80 శాతం జనాభా ఉన్న బీసీలకు మాత్రం కేవలం 32 శాతం రిజర్వేషన్లతో సరిపెట్టడం సరికాదన్నారు. కాంగ్రెస్ కు టీల నీతిని ప్రజలు గమనిస్తున్నారని.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. సమావేశంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు కెంచె శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు పోషల్ వినోద్, మండల మాజీ అధ్యక్షుడు సాయిబన్న ఉన్నారు.
పరిహారం మూడింతలు పెంచి ఇస్తాం
దేవరకద్ర: దేవరకద్ర మండలంలోని వెంకటాయపల్లి శివారు నుంచి బల్సుపల్లి వరకు చేపట్టే రైల్వే డబ్లింగ్ పనుల కోసం కావాల్సిన భూసేకరణపై బుధవారం రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ నర్సింహారెడ్డి రైతులతో చర్చించారు. దాదాపు 70 మంది రైతులకు సంబంధించిన భూములను రైల్వే డబ్లింగ్ పనుల కోసం ఇప్పటికే గుర్తించామని ఆయన తెలిపారు. ప్రభుత్వపరంగా ఎకరాకు నిర్ణయించిన ధర కంటే మూడింతలుగా పెంచి నష్టపరిహారం అందించనున్నట్లు వివరించారు. కాగా.. మార్కెట్లో ఎకరాకు పలుకుతున్న ధరను దృష్టిలో పెట్టుకొని ఆ మేరకు నష్టపరిహారం లెక్కించి ఇవ్వాలని రైతులు కోరారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపిస్తామని ఆయన తెలిపారు. అనంతరం భూసేకరణ చేసే రైతుల జాబితాలను వెల్లడించారు.
నేడు ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమావేశం
స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల ఫోరం సర్వసభ్య సమావేశాన్ని నేడు (గురువారం) స్థానిక తెలంగాణ చౌరస్తాలోని రెడ్క్రాస్ భవనంలో నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు ఎ.రాజసింహుడు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు నిర్వహించే ఈ సమావేశంలో కనీస పెన్షన్ పెంపుదల, నూతన కార్యవర్గం ఏర్పాటు, ఇతర సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.

పేద పిల్లలకు ఆధార్ నమోదు చేయిద్దాం

పరిహారం మూడింతలు పెంచి ఇస్తాం