
సాంకేతికతతో కూడిన విద్య అందించాలి
● తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన
కోస్గి రూరల్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు సైతం సాంకేతికతతో కూడిన విద్య అందించాలని తెలంగాణ రారష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన అన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలను ఆమె సందర్శించి, హెచ్ఓడీ, ప్రిన్సిపాల్తో రివ్యూ చేపట్టారు. ప్రతి కళాశాలలో విద్యార్థులకు అవసరమైన ల్యాబ్, హాస్టల్ సౌకర్యం ఉండాలని, సిబ్బంది కొరత ఉంటే తేలియజేయాలన్నారు. కళాశాలల నిర్వహణ సక్రమంగా లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కోస్గి కళాశాలపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. ఆనంతరం బాలుర వసతి గృహన్ని సందర్శించి, భోజనాన్ని, నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ట్రెయిని కలెక్టర్ ప్రణయ్కుమార్, ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.
శ్రామికుల శ్రమ దోపిడీపై పోరాటం
నారాయణపేట: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 282 జీఓతో 12 గంటల పని దినం ప్రవేశపెట్టడం శ్రామికులను నిలువు దోపిడి చేయడమేనని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తితో 8 గంటల పని దినాన్ని నేడు ప్రభుత్వాలు రూపమాపేందుకు ప్రయత్నిస్తున్నాయని వాపోయారు. దేశంలో మొదటగా గుజరాత్, ఆ తర్వాత కర్ణాటక, ఇప్పుడు తెలంగాణ 12 గంటల పని దినాన్ని అమలు చేసేందుకు జీఓలు జారీ చేయడం దారుణమన్నారు. రూ.16 లక్షల కోట్లు ఆస్తులున్న అంబానీ, ఆదానీ వంటి కార్పొరేట్ శక్తులకు రైట్ ఆఫ్ చేసిన కేంద్ర ప్రభుత్వం కార్మికులకు మాత్రం కనీస వేతనం రూ.26 వేలు, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించడానికి మాత్రం మీనమేషాలు లెక్కిస్తుందని దుయ్యబట్టారు. స్వాతంత్రం పూర్వం నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలన్నింటిని సవరించి యజమానులకు అనుకూలంగా నాలుగు కార్మిక కోడ్లు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. ఆగస్టు 10న మక్తల్లో నిర్వహించే అంగన్వాడీ, ఆగస్టు 11న ఆశా వర్కర్స్ నారాయణపేట జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి, జిల్లా కార్యదర్శి బాల్రాం, ఉపాధ్యక్షుడు జ్యోషి తదితరులు పాల్గొన్నారు.
రైతు హితమే కేంద్రం
అభిమతం
మహబూబ్నగర్ రూరల్: రైతు హితమే కేంద్ర ప్రభుత్వ అభిమతం అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం పీఎం కిసాన్ సమ్మాన్ 20వ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని అధికారులు, రైతులతో కలిసి ఆమె ప్రత్యక్షంగా ప్రధాని మోదీ సందేశాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా మోదీ ప్రభుత్వం నిరంతరం పని చేస్తోందన్నారు. తమ ప్రభుత్వం చేసేదే చెబుతుందని, చెప్పిందే చేసి చూపుతుందన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు మహబూబ్నగర్ జిల్లాలోని 65,996 మంది రైతులకు లబ్ధి కలిగిందన్నారు. ఏడాదిలో ఎకరాకు రూ.18వేల సబ్సిడీతో ఎరువులు అందించడంతో పాటు ధాన్యం సేకరణ కోసం అయ్యే ప్రతి రూపాయిని కేంద్ర ప్రభుత్వమే అందిస్తుందన్నారు. రైతులకు లబ్ధి చేకూర్చేందుకే కిసాన్ సమ్మాన్, ఫసల్ బీమా యోజన, పీఎం ధాన్య సమృద్ధి కిసాన్ క్రెడిట్ కార్డులు వంటి ఎన్నో పథకాలను తీసుకు వచ్చామన్నారు.

సాంకేతికతతో కూడిన విద్య అందించాలి