● ఉత్సవాల్లో డీజేకి అనుమతి లేదు
● వినాయక ఉత్సవ కమిటీ
నిర్వాహకులతో ఏఎస్పీ
నంద్యాల(వ్యవసాయం): వినాయక చవితి వేడుకల్లో మట్టి విగ్రహాల ఏర్పాటుకు ప్రాధాన్యమివ్వాలని ఏఎస్పీ సుస్మిత సూచించారు. ఆదివారం రామకృష్ణారెడ్డి డిగ్రీ కాలేజీ ఆడిటోరియంలో వినాయక ఉత్సవ కమిటీల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పండుగను భక్తిశ్రద్ధలతో ఐదు రోజులు పాటు నిర్వహించుకోవాలన్నారు. ఎత్తైన విగ్రహాలు కాకుండా తక్కువ ఎత్తు ఉండే విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మండపాల వద్ద అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యువకులు నిమజ్జనోత్సవంలో మద్యం సేవించి పాల్గొంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్యలు ఏవైనా ఉంటే కేంద్ర ఉత్సవ సమితి దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే ఉత్సవాల్లో డీజే ఏర్పాటుకు అనుమతులు ఇవ్వమన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వినాయక వేడుకలను విజయవంతం చేయాలని చెప్పారు. అనంతరం ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లు విడుదల చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో విశ్వనాథ, తహసీల్దార్ శ్రీనివాసులు, కమిషనర్ శేషన్న, డీఈ నాగరాజు, కేంద్ర సమితి సభ్యులు రామకృష్ణారెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.


