● నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి
బొమ్మలసత్రం: సమాజంలో జరిగే అవినీతిని ప్రజలకు చూపించే జర్నలిస్టులు ప్రభుత్వానికి దేశద్రోహుల్లా కనిపిస్తున్నారా అని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి , ఎమ్మెల్సీ ఇసాక్బాషా ప్రశ్నించారు. గత ఆదివారం అర్ధరాత్రి పోలీసులు అక్రమంగా నిర్బంధించి రిమాండ్కు తరలించిన జర్నలిస్టులు నాగచంద్రుడు, సురేష్ కుటుంబ సభ్యులను వారు బుధవారం పరామర్శించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మాట్లాడుతూ.. నిజాలను ప్రజలకు చూపించిన జర్నలిస్టులను రాజకీయ ఒత్తిళ్లతో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో తలుపులు బద్దలుకొట్టి అక్రమంగా నిర్బంధించడం చట్టవ్యతిరేకమన్నారు. పోలీసులు అలా అరెస్ట్ చేయటానికి జర్నలిస్టులు ఉగ్రవాదుల్లా, దేశద్రోహుల్లా కనిపిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. న్యాయశాఖా మంత్రి ఎన్ఎమ్డీ ఫరూక్ కుమారులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని విమర్శించారు. అనధికార వ్యక్తులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనటం సరైందికాదన్నారు. టీవీ ఛానల్లో లోగుట్టు కార్యక్రమం ద్వారా మంత్రి కుమారులపై వచ్చిన కథనం వాస్తవం కాదా అని నిలదీశారు. వార్త ప్రసారాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప అక్రమ కేసులు బనాయించడం సమంజసం కాదన్నారు. చంద్రబాబు పాలనను ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ సోషల్ మీడియా, జర్నలిస్ట్లను ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందన్నారు. అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా వ్యవహరించటం బాధాకరమన్నారు.


