గాజులపల్లె, బసవాపురం గ్రామాల పరిధిలో గతంలో ప్రభుత్వం పేదలకు సాగు, జీవనాధార నిమిత్తం డీకేటీ భూములు ఇచ్చింది. నిబంధనల ప్రకారం వీటిని అమ్మడం, విక్రయించడం చట్టరీత్యా చెల్లదు. అయితే ఈ భూములకు సాగు నీరు సరిగా లేకపోవడంతో పాటు నల్లమల శివారులో ఉండటంతో కొందరు రైతులు అలాగే వదిలేశారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడం వలన కాంట్రాక్టర్లు వీటిపై కన్నేశారు. రైతులకు ఆశ చూపి ఎకర భూమిని రూ. 2 లక్షల నుంచి రూ. 3లక్షలు పెట్టి కొనుగోలు చేస్తూ గ్రావెల్, ఎర్రమట్టి తరలింపు చేస్తూ పొలాలను చెరువులుగా మారుస్తున్నారు. మరికొన్ని పొలాల కోసం కాంట్రాక్టర్లు అన్వేషిస్తున్నట్లు సమీప పొలాల రైతులు తెలుపుతున్నారు. ఒక పొలంలో 100 నుంచి 120 అడుగుల లోతుతో మట్టిని తీస్తే ఏర్పడే గుంతలతో భవిష్యత్తులో పక్క పొలాలకు నీళ్లు అందే పరిస్థితి లేదని ప్రస్తుతం సాగు చేస్తున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


