● రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
పాణ్యం: కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై తమ్మరాజుపల్లె సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుపతి జిల్లాకు చెందిన ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. తిరుపతి జిల్లా వెంకటగిరి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం, సుమతి దంపతులకు ముగ్గురు కుమారు లు. చివరి కుమారుడు ఎం. అశ్విత్(26) ఉద్యోగం కోసం హైదరాబాద్లో ఉండగా, రెండో కుమారుడు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ కాకినాడకు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో బెంగళూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో అశ్విత్కు ఉద్యోగం వచ్చింది. ఆ ఆనందాన్ని కుటుంబ సభ్యులతో పంచుకునేందుకు అన్న బైక్ తీసుకుని గురువారం రాత్రి సొంతూరుకు బయలుదేరాడు. మార్గమధ్య లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో నంద్యాల జిల్లా తమ్మరాజుపల్లె గ్రామం వద్ద రాజస్థాన్ డాబా వద్ద ప్రమాదవశాత్తు హైవే రైలింగ్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని చికిత్స నిమిత్తం నంద్యాలకు తరలించగా కోలుకోలేక అశ్విత్ మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి, కేసు నమోదు చేశామన్నారు. ఉద్యోగం కోసం ఎదురు చూసిన యువకుడు తీరా ఉద్యోగంలో చేరే సమయంలో మృతి చెందడం విషాదం.


