గోస్పాడు: ఎటువంటి కేసులు లేని గ్రామంగా సత్యనారాయణాపురాన్ని గుర్తించినట్లు ఉమ్మడి కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి లీలా వెంకట శేషాద్రి తెలిపారు. గురువారం సత్యనారాయణాపురంలో సద్భావన దివస్ ప్రాధాన్యత, మధ్యవర్తిత్వం 3.0 జాతీయ లోక్ అదాలత్పై గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. ప్రజలకు చట్టపరమైన హక్కులు, బాధ్యతలు, వివాదాల నివారణ, వివాదాలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం, పరస్పర చర్చలు, రాజీ ద్వారా పరిష్కరించుకోవడం, అవసరమైనప్పుడు న్యాయ సేవలు పొందడం వంటి వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. గ్రామాన్ని కేసులు లేని గ్రామంగా కొనసాగిస్తూ భవిష్యత్తులో కూడా వివాదాలకు దూరంగా, శాంతియుతంగా ఉండేలా గ్రామ ప్రజలందరూ సహకరించాలని కోరారు. అనంతరం గ్రామ ప్రజలచే సద్భావ ప్రతిజ్ఞను కుల, మత, ప్రాంతీయ వ్యత్యాసాలను పక్కనబెట్టి హింసాత్మక మార్గాలను నిరాకరిస్తూ రాజ్యాంగ బద్ధమైన చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటామని ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సుస్మిత, సీఐ సీతారామిరెడ్డి, ఎస్ఐ సుధాకర్రెడ్డి, షహనా, తదితరులు పాల్గొన్నారు.


