కోవెలకుంట్ల: పట్టణంలోని బసిరెడ్డిబావి వీధిలో ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు.. స్థానికంగా నివాసముంటున్న లక్ష్మీనారాయణ ఈ నెల 8వ తేదీ రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దొంగలు ఇంట్లోకి ప్రవేశించి బీరువా తలుపులు బద్ధలు కొట్టి అందులో ఉన్న 13 తులాల బంగారు ఆభరణాలు, రూ. 5.50 లక్షల నగదును అపహరించుకెళ్లారు. మంగళవారం అర్ధరాత్రి తిరుమల నుంచి ఇంటికి చేరుకున్న లక్ష్మీనారాయణ బీరువా తలుపులు తెరిచి ఉండటంతో చోరీ జరిగిందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోవెలకుంట్ల సీఐ హనుమంతునాయక్, ఎస్ఐ మల్లికార్జునరెడ్డి చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. డాగ్సా్వ్క్డ్, క్లూస్టీం రంగ ప్రవేశం చేసి చోరీఘటనపై ఆధారాలు సేకరిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో కోవెలకుంట్ల పట్టణంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వారం రోజుల క్రితం స్కంద కాలనీలో రిటైర్డ్ ఉద్యోగి బాబయ్య ఇంట్లో దొంగలు ప్రవేశించి రూ. 3 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ. 5 వేలు నగదు అపహరించుకెళ్లారు. సరిగ్గా వారం రోజులకే మరో చోరీ జరిగి భారీగా బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.


