● 14న మొక్కలు నాటే కార్యక్రమాన్ని
నిర్వహించాలి
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి
కర్నూలు(సెంట్రల్): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 13, 14, 15 తేదీల్లో ప్రతి ఇళ్లు, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, ఇతర ప్రతిష్టాత్మక ప్రదేశాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలిపారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల14న నిర్వహించే ప్రత్యేక మొక్కలు నాటే కార్యక్రమంలో కూడా ప్రజలు భాగస్వామం కావాలన్నారు. డీఎఫ్ఓ, డ్వామా, డీఆర్డీఏ, డీఈఓ, మెప్మా శాఖలు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రధాన కూడళ్లు, ఇతర ముఖ్యమైన ప్రదేశాలతోపాటు ప్రజలు తమ ఇళ్ల ఆవరణల్లో కూడా మొక్కలను పెంచుకోవాలని సూచించారు. అవసరమైన మొక్కలను డీఆర్డీఏ, మెప్మా శాఖలు ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. అనే నేను భావనతో ప్రత్యేక సోషల్ మీడియా ప్రచారాన్ని నిర్వహించాలని, ఈకార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహించే బాధ్యతను సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రధానంగా చేపట్టాలని సూచించారు. ఆగస్టు 14,15 తేదీల్లో కలెక్టరేట్తోపాటు అన్ని ప్రభుత్వ భవనాలు, ప్రధాన ప్రజా ప్రదేశాలు, రైల్వే, బస్ స్టేషన్లలో జాతీయ పతాకం రంగుల్లో విద్యుత్ అలంకారణ చేపట్టాలన్నారు. ఆగస్టు 10 నుంచి 15వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులతో దేశ నిర్మాణంలో తనవంతు బాధ్యత వహిస్తానని ప్రతిజ్ఞ చేయించాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు. యువత నేషనల్ బిల్డింగ్లో భాగస్వాములు పేరిట ఆగస్టు 10 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలని ఆదేశించారు.


