● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: సున్నిపెంటలోని ఆక్రమణలకు సంబంధించిన అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి, సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి రెవెన్యూ, సర్వే అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్తో కలిసి సున్నిపెంటలోని ఆక్రమణలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ సున్నిపెంట పరిధిలోని ఆక్రమణలకు సంబంధించి అందుబాటులో ఉన్న రెవెన్యూ రికార్డులు, భూ సర్వే వివరాలను ఆధారంగా తీసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించి, పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలన్నారు. ఏపీఎల్, బీపీఎల్ కుటుంబాల సంఖ్య, ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నవారు, పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు, గతంలో ఎవరికై నా పట్టాలు జారీ చేశారా? లేదా అనే అంశాలను కూడా పరిశీలించి డేటాను సిద్ధం చేయాలన్నారు. గతంలో జరిగిన పరిశీలనలు, సంబంధిత కేసులకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు కలెక్టర్కు వివరించారు. కోర్టు కేసుల పరిధి, అందుబాటులో ఉన్న రికార్డులు, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నివేదికను సిద్ధం చేయాలన్నారు. హైకోర్టులో కొనసాగుతున్న కేసుకు సంబంధించి ప్రభుత్వం తరఫున సమర్పించాల్సిన కౌంటర్ అఫిడవిట్కు అవసరమైన వాస్తవ వివరాలను సంబంధిత రికార్డుల ఆధారంగా సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో ఆత్మకూరు ఆర్డీఓ వెంకట శివ, ల్యాండ్ అండ్ సర్వే ఏడీ శ్రీరాం, రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు పాల్గొన్నారు.


