● వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ సమన్వయకర్త బుట్టా రేణుక
కర్నూలు (టౌన్): అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేనేత కార్మికులను సీఎం చంద్రబాబు మోసం చేస్తూ వచ్చారని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ సమన్వయకర్త బుట్టా రేణుక విమర్శించారు. కర్నూలులోని వైఎస్సార్సీపీ కార్యాలయం ప్రాంగణంలో శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. పార్టీ నాయకులు బుట్టా శివ నీల కంఠం, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుట్టా ప్రతూల్, మాజీ కార్పొరేటర్ శ్రీనివాసులు, కుర్ని నాయకులు రాధక్రిష్ణ హాజరయ్యారు. తొలుత మహానేత డాక్టర్ వైఎస్. రాజశేఖర్ రెడ్డి, చేనేత రంగానికి విశిష్ట సేవలందించిన మాచాని సోమప్ప చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండున్నర్ర ఏళ్ల తరువాత నేతన్న కు రూ.25 వేలు ఇస్తున్నారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కరోనా వంటి ఇబ్బందులు ఉన్నా ఐదేళ్ల పాటు రూ. 24 వేలు అందించిందన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఒక వెయ్యి పెంచి రెండేళ్ల తరువాత మంజూరు చేస్తోందన్నారు. మగ్గం ఉన్న ప్రతి ఒక్కరికీ ఇవ్వాలని, కొర్రీలు పెట్టి ఎగొట్టే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. అద్దె ఇంట్లో ఉన్నా.. అద్దెకు మగ్గం తీసుకొని వృత్తిని కొనసాగిస్తున్న వారందరికీ నిధులు ఇవ్వాలన్నారు. త్వరలోనే బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేతన్నల కోసం పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. చేనేత సోసైటీలను కాపాడుకుంటామన్నారు. అనంతరం కర్నూలు, కల్లూరు, ఎమ్మిగనూరు ఇతర ప్రాంతాల నుంచి నేతన్నలు బుట్టా రేణుకను ఘనంగా సత్కరించారు.


