నంద్యాల(అర్బన్): సీమ ప్రాజెక్టులకు తక్షణమే నీటిని విడుదల చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. శ్రీశైలం నీటి విడుదలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే కేసీ కెనాల్, తెలుగుగంగ, ఎస్సార్బీసీ పరిధిలోని ఆయకట్టు రైతులతో కలిసి రైతాంగ ఉద్యమం ఉద్ధృతం చేస్తామని సమితి ఉపాధ్యక్షుడు ఏర్వ రామచంద్రారెడ్డి, శంకర్రెడ్డి హెచ్చరించారు. శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల నీటి మట్టాన్ని కాపాడి, సీమకు రావాల్సిన నీటిని తక్షణమే విడుదల చేయాలని కోరుతూ బుధవారం జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, జలవనరుల శాఖ అధికారులు ప్రతాప్లకు సమితి నాయకులు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గత వర్షా కాలంలో విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని దిగువకు విడుదల చేశారన్నారు. ప్రస్తుతం ఎగువన ఉన్న కర్ణాటక పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరదనీరు వచ్చి చేరిందన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, తెలుగుగంగ, గాలేరు–నగరి ప్రాజెక్టులతో అనుసంధానమైన రిజర్వాయర్లు, గ్రామీణ చెరువులకు తక్షనమే నీటి విడుదల చేయాలన్నారు. సీమ ప్రజల చట్టబద్ధమైన జలహక్కులను పరిరక్షిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. నంది రైతు సమాఖ్య అధ్యక్షుడు బెక్కెం రామసుబ్బారెడ్డి, సుధాకర్రావు, దామోదర్రెడ్డి, సదాశివారెడ్డి, చిన్నరామకృష్ణారెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, పెద్దన్న, భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


