మహానంది: అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా మట్టి దందాకు పాల్పడుతున్నారు. బొల్లవరం చెరువులో మట్టి తవ్వకాలు చేపట్టి అక్రమంగా తరలిస్తున్నారు. మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురం గ్రామంతో పాటు మరికొన్ని గ్రామాలకు చెందిన నాయకులు సిండికేట్గా మారి బొల్లవరం చెరువులో జేసీబీలతో తవ్వి, ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వీరికి నియోజకవర్గ స్థాయి నేత ఒకరు అండగా ఉన్నట్లు అధికారపార్టీ నేతలే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. రైతుల పొలాల కోసం అంటూనే రియల్ ఎస్టేట్ వెంచర్లతో పాటు ఇళ్ల నిర్మాణాలకు మట్టిని తరలిస్తున్నారు. ట్రాక్టర్ మట్టిని రూ. 1000 నుంచి రూ. 1200 వరకు విక్రయిస్తున్నారు. దూరాన్ని బట్టి అధికంగా వసూలు చేస్తున్నారన్నారు. అధికారులు స్పందించి మట్టి దందాపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


