
ఒక్క మాత్రతో ‘నులి’పేద్దాం!
● ఆల్బెండజోల్ మాత్రల
పంపిణీకి చర్యలు
● జిల్లాలో 4,38,475 మంది పిల్లలు
● 1 నుంచి 19 ఏళ్ల లోపు పిల్లలందరికీ
మాత్రలు
● రేపు జాతీయ నులిపురుగుల నివారణ
దినోత్సవం
మాత్రల పంపీణీకి
పకడ్బందీ ఏర్పాట్లు
ఈ నెల 12న జిల్లా అంతటా ఆల్బెండాజోల్ మాత్రలు పిల్లలకు అందజేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేశాం. 4,38,475 మంది పిల్లలకు ఆల్బెండాజోల్ మాత్రలు అందజేయనున్నాం. నులిపురుగుల నివారణకు ఆల్బెండాజోల్ మాత్రలు తీసుకోవడం ఒక్కటే మార్గం. కాలకృత్యాల తీర్చుకున్న అనంతరం తప్పనిసరిగా చేతులను శుభ్రపరుచుకోవాలి.
– డాక్టర్ వెంకటరమణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, నంద్యాల.
అవగాహన కల్పించాం
ఆల్బెండజోల్ మాత్రలను మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత మాత్రమే విద్యార్థులకు ఇవ్వాలి. మాత్రలను చప్పరించడం లేదా నమిలి మింగటం చేయాలి.మాత్రలు తీసుకున్న తర్వాత ఏవిదమైన ఇబ్బందులు ఎదురైనా వెంటనే దగ్గరలోని వైద్య సిబ్బందిని సంప్రదించాలి. అంగన్వాడీ, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని పిల్లలందరికీ ఆల్బెండాజోల్ మాత్రలను అందించనున్నాం.
– డాక్టర్ కాంతారావునాయక్,
జిల్లా ప్రోగ్రాం అధికారి,
రాష్ట్రీయ బాల స్వాస్య్థ కార్యక్రమం
గోస్పాడు: చిన్నారులను పీడించే అనారోగ్య సమస్యల్లో నులిపురుగులు ప్రధానమైనవి. ఈ పురుగులు పిల్లల కడుపులో చేరి మెలిపెడుతూ పిల్లల్లో పేలతనం, నీరసం, ఆహారం సరిగా తీసుకోకపోవడం తరచూ కనిపిస్తుంటుంది. అలాగే పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపిస్తాయి. రక్తహీనత, పోషకలోపం, పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతుంటాయి. నిర్లక్ష్యంగా ఉంటే జీవితాలనే నులిమేస్తాయి. 19 సంవత్సరాలలోపు పిల్లల్లో నులిపురుగుల సమస్య ఎక్కువ ఉంటుంది. ఒకే ఒక్క మాత్ర ఆల్బెండ్ జోల్తో ఈ సమస్యను నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఈనెల 12న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా అంగన్వాడీలు, పాఠశాలలు, జూనియర్, కళాశాల ల్లో చదువుకుంటున్న పిల్లలకు ఆల్బెండజోల్ మాత్ర లు పంపిణీ చేసేందుకు వైద్యశాఖ చర్యలు చేపట్టింది. జిల్లాలో 1663 అంగన్వాడీ కేంద్రాలు, 2,141 పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేసేలా గుర్తించారు. వీటి పరిధిలో1,22,094 మంది ఒక సంవత్సరం నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలు, 3,16,381 మంది 6 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలు ఉన్నట్లు జిల్లా వైద్యశాఖ అధికారులు గుర్తించారు. వీరందరికీ ఆల్బెండజోల్ మాత్రలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు. ఏదైనా పరిస్థితుల దృష్ట్యా 12వ తేదీన మాత్రలు తీసుకొని వారు ఉంటే వారి కోసం మాప్ అప్ డే రోజున ఈనెల 20వ తేదీ మరోమారు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో మాత్రలు అందజేయనున్నారు.
అపరిశుభ్రతే కారణం...
పిల్లల్లో నులిపురుగులు సంక్రమించడానికి ప్రధాన కారణం అపరిశుభ్రత. దుమ్ము, ధూళి, మట్టిలో ఆడుకోవడం, బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయడం వల్ల నులి పురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. పిల్లల చేతిగోర్లను శుభ్రంగా ఉంచేలా తల్లిదండ్రులు చూసుకోవాలి. భోజనం చేసేటప్పుడు, మూత్ర, మల విసర్జన అనంతరం చేతులు శుభ్రం చేసుకోవడం పిల్లలకు నేర్పించాలి. పండ్లను నీటితో కడిగి తినాలి. ఆహార పదార్థాలపై ఎప్పడూ మూతలు మూసి ఉంచాలి.
వ్యాపించే విధానం...
శరీరంలో నులిపురుగులు ఉన్న వారు చేసిన మల విసర్జన ద్వారా కలుషితం అయి తద్వారా వాటి గుడ్లు నేలలో లార్వాలుగా వృద్ధి చెందే అవకాశం ఉంది. అంతేకాక తాగు నీరు, గాలి ద్వారా ఆహార పదార్థాలపై చేరుతాయి. మురికి చేతులు ద్వారా ఈ లార్వా చర్మం లోపలికి చొచ్చుకుపోవడం ద్వారా మిగతా పిల్లలకు నులి పురుగులు సంక్రమిస్తాయి.
అనేక రకాలుగా అనర్థాలు..
నులిపురుగులు అపరిశుభ్రత వల్లే శరీరంలోకి ప్రవేశిస్తాయి. పిల్లల రక్తహీనతకు దారితీస్తాయి. మానసిక ఎదుగుదలకు ఆటంకంగా మారుతాయి. కడుపునొప్పి, వికారము కలగజేస్తాయి. ఆహారం సహించదు ,ఆకలి ఉండదు. నీరసంగా ఉంటుంది.పిలల్ల కడుపులో కొంకి, నులి, బద్దె, గుండ్రని పురు గులు రక్తాన్ని పీల్చేస్తాయి. వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వాంతులు, మలంలో రక్తం, అతిసారం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆ పురుగుల పునరుత్పత్తి, ఎదుగుదల మొత్తం మన కడుపులోనే జరగడంతో మనం తీసుకునే ఆహారాన్ని ఆ పురుగులు శోషించుకుంటాయి.
మాత్రల డోస్ ఇలా..
నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలను ఏడాది నుంచి రెండేళ్లలోపు చిన్నారులకు సగం మాత్ర (200 మిల్లీగ్రాములు) నీటిలో కలిపి తాపాలి. 2 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలకు 400 మిల్లీగ్రాముల మాత్రను మధ్యాహ్నం భోజనం తరువాత చప్పరించేలా చూడాలి. మింగకుండా వైద్య సిబ్బంది పర్యవేక్షించాలి.

ఒక్క మాత్రతో ‘నులి’పేద్దాం!

ఒక్క మాత్రతో ‘నులి’పేద్దాం!

ఒక్క మాత్రతో ‘నులి’పేద్దాం!