‘పీఎం జన్‌ధన్‌’తో చెంచులకు 600 ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

‘పీఎం జన్‌ధన్‌’తో చెంచులకు 600 ఇళ్లు

Aug 11 2025 6:17 AM | Updated on Aug 12 2025 12:57 PM

జిల్లా కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల: పీఎం జన్‌ధన్‌ పథకంతో చెంచులకు 600 ఇళ్లకు అనుమతులు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు. చెంచుగూడేల్లోని పీవీటీజీలకు ఇళ్ల నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.1.80 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా శనివారం కలెక్టరేట్‌ల్లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యావంతులు కావాలన్నారు. చెంచు గూడేల్లోని గిరిజనులకు ఆరోగ్యపరమైన సహాయ సహకారాలు అందించేందుకు క్యాంపులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్‌ దృష్టికి చెంచుల సమస్యలను గిరిజన సంఘాల నాయకులు తీసుకొచ్చారు. ఐటీడీఏ పీఓ వెంకట శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

వెండి శ్రీచక్రం బహూకరణ

బనగానపల్లె రూరల్‌: మండలంలోని నందవరం గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారికి శనివారం బెంగళూరుకు చెందిన ఎస్‌పీ రావు కుటుంబ సభ్యులు వెండి శ్రీచక్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. శ్రీచక్రం విలువ రూ.1,17,800 ఉంటుందన్నారు.

పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల తగ్గింపు

జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి నీటి విడుదలను 35 వేల నుంచి 32వేల క్యూసెక్కులకు తగ్గించినట్లు ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కురుస్తున్న వర్షాలతో దిగువప్రాంతాల్లోని కాల్వలు ఉప్పొంగి ప్రవహించకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నాపరు. వర్షాలు తగ్గిన తర్వాత నీటి విడుదలను పెంచే అవకాశాలున్నాయని తెలిపారు.

డ్రోన్‌తో ట్రాఫిక్‌ నియంత్రణ

శ్రీశైలంప్రాజెక్ట్‌: డ్రోన్‌ సహాయంతో శ్రీశైలం డ్యాం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. శ్రీశైలం టూటౌన్‌ సీఐ జి.చంద్రబాబు తన సిబ్బందితో శనివారం డ్రోన్‌ను ప్రయోగించి పర్యవేక్షణ చేపట్టారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు వరుస సెలవు దినాలు రావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా పర్యవేక్షణ చేస్తున్నారు. డ్యాం పరిసరాల్లో డ్రోన్‌ను ఉపయోగించి వాహనాల రాకపోకలను పర్యవేక్షిస్తు సిబ్బందికి సూచనలు ఇస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా చేస్తున్నారు.

శ్రీశైలం డ్యాం నీటిమట్టం 879 అడుగులు

శ్రీశైలం ప్రాజెక్ట్‌: శ్రీశైలం జలాశయ నీటిమట్టం శనివారం సాయంత్రం సమయానికి 879.10 అడుగులకు చేరుకుంది. శ్రీశైలానికి వస్తున్న ఇన్‌ఫ్లోల కన్నా ఔట్‌ఫ్లో ఎక్కువగా ఉండడంతో నీటిమట్టం తగ్గుతుంది. శుక్రవారం నుంచి శనివారం వరకు ఎగువ జూరాల, సుంకేసుల నుంచి 91,641 క్యూసెక్కుల వరద శ్రీశైలానికి వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్‌లకు 1,05,336 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. విద్యుత్‌ ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్‌కు 67,368 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 

బ్యాక్‌ వాటర్‌ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 32,750 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,818 క్యూసెక్కుల నీటిని వదిలారు. కుడిగట్టు కేంద్రంలో 14.982 మిలియన్‌ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 15.776 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ప్రస్తుతం జలాశయంలో 183.4198 టిఎంసీల నీరు నిల్వ ఉంది.

డ్రోన్‌తో ట్రాఫిక్‌ నియంత్రణ1
1/2

డ్రోన్‌తో ట్రాఫిక్‌ నియంత్రణ

‘పీఎం జన్‌ధన్‌’తో చెంచులకు 600 ఇళ్లు 2
2/2

‘పీఎం జన్‌ధన్‌’తో చెంచులకు 600 ఇళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement