
డ్రోన్ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
కర్నూలు కల్చరల్: యువత డ్రోన్ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని క్లస్టర్ యూనివర్సిటీ ఇన్చార్జ్ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ వి. వెంకట బసరావు అన్నారు. హైదరాబాద్ ఐఐటీ, తిహాన్ ఫౌండేషన్, కర్నూలు ఐఐటీ డీఎం ఆధ్వర్యంలో క్లస్టర్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ధిపై శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం వీసీ ప్రారంభించి మాట్లాడారు. నేటి తరం విద్యార్థులు ప్రతి ఒక్కరు డ్రోన్ నైపుణ్యం కలిగి ఉండడం వల్ల మంచి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయన్నారు. వందల ఎకరాల్లో డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన కంపెనీని స్థాపించడం ఇక్కడి విద్యార్థులకు వరమన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈనెల 20వ తేదీ వరకు జరిగే శిక్షణలో 50 మంది ఎస్సీ విద్యార్థులకు ‘రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్ –డ్రోన్స్’ అనే అంశంపై, ఇతర కులాలకు చెందిన 50 మంది విద్యార్థులకు ‘బూట్ క్యాంప్ డ్రోన్ టెక్నాలజీ’ అనే అంశంపై శిక్షణ ఉంటుందన్నారు. వర్సిటీ సిల్వర్ జూబ్లీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీఎస్ కుమార్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ దేవికా రాణి మాట్లాడారు. డాక్టర్ మొహమ్మద్ వాయిజ్, డాక్టర్ ఎం.పద్మావతి, లక్ష్మణ గుప్త శిక్షణ కన్వీనర్లుగా వ్యవహరించారు. వర్సిటీ డీన్ అక్తర్ బాను, ట్రిపుల్ ఐటీ అధ్యాపకులు డాక్టర్ పి.కిషోర్, తదితరులు పాల్గొన్నారు.