ఆ‘ధర’ణ లేక అన్నదాత విలవిల | - | Sakshi
Sakshi News home page

ఆ‘ధర’ణ లేక అన్నదాత విలవిల

Apr 16 2025 11:18 AM | Updated on Apr 16 2025 11:18 AM

ఆ‘ధర’ణ లేక అన్నదాత విలవిల

ఆ‘ధర’ణ లేక అన్నదాత విలవిల

● మొక్కజొన్న పంటకు లభించని మద్దతు ధర ● పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ● ఏర్పాటు కాని కొనుగోలు కేంద్రాలు ● తీవ్రంగా నష్టపోతున్న రైతులు

కోవెలకుంట్ల: రబీలో మొక్కజొన్న సాగు చేసిన రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో మార్కెట్‌లో నష్టానికి పంటను అమ్ముకోవాల్సి వస్తోంది. నెల రోజుల క్రితం వరకు క్వింటా రూ. 2,400 వరకు ధర పలుకగా ప్రస్తుతం రోజు రోజుకు పతనమవుతోంది. ప్రస్తుత మార్కెట్‌లో క్వింటా రూ. 2వేలకు మించి పలకడం లేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈ ఏడాది రబీ సీజన్‌లో 10 వేల హెక్టార్లలో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. అవుకు మండలంలో 1,063 , సంజామల మండలంలో 404, కొలిమిగుండ్ల మండలంలో 138, ఉయ్యాలవాడ మండలంలో 117, కోవెలకుంట్ల మండలంలో 22 , దొర్నిపాడు మండలంలో 30 హెక్టార్లలో మొక్కజొన్న సాగైంది. మొత్తం 120 రోజుల పంటకాలం కలిగిన పైరులో ఆయా మండలాల్లో కోత, నూర్పిడి పనులు దాదాపు పూర్తికావచ్చాయి. కల్లాల్లో పంటను ఉంచి రైతుల అష్ట కష్టాలు పడుతున్నారు.

వెంటాడిన ఎండు తెగులు

జిల్లాలోని రైతులు కొన్ని సంవత్సరాల నుంచి పంటమార్పిడి చేయకుండా ప్రతి ఏటా మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో విస్తారంగా మొక్కజొన్న పంట సాగు చేశారు. పైరు కంకిదశలో ఉండగా గత ఏడాది అక్టోబర్‌ నెలలో తుపాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. దీంతో పంట దెబ్బతిని దిగుబడులు తగ్గాయి. పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 30 వేలకు పైగా వెచ్చించినా ఎకరాకు 22 నుంచి 30 క్వింటాళ్లలోపే దిగుబడులు వచ్చాయి. మార్కెట్‌లో గిట్టుబాటు ధర అంతంత మాత్రంగానే ఉండి ఆధరకే విక్రయించి నష్టాల ఊబిలో కూరకపోయారు. ఈ నష్టాన్ని పూడ్చుకోవచ్చని కోటి ఆశలు పెట్టుకుని రబీలో తిరిగి అదే పొలాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారు. రెండు సీజన్లలో ఒకే రకమైన పంట కావడంతో పైరును విల్ట్‌(ఎండు తెగులు) వెంటాడింది. వివిధ దశల్లో తెగులు ఆశించి మొక్కజొన్న కర్రలు ఎండిపోయాయి. ఎకరాకు రూ. 30 వేల నుంచి రూ 35 వేల వరకు రైతులు ఖర్చు చేశారు. అష్టకష్టాలు పడినా ఎకరాకు 20 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాలేదు. దిగుబడులు తగ్గినా మార్కెట్‌లో మద్దతు ధర లభించలేదు. ఆపదలో వెన్నుదన్నుగా నిలువాల్సిన కూటమి సర్కార్‌ రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అకాల వర్షాలతో అదనపు భారం

కొనుగోలు కేంద్రాల ఊసేలేదు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్ద పీట వేసింది. విత్తనానికి ముందే ఆయా పంటలకు మద్దతు ధర ప్రకటించి ఆదుకుంది. వివిధ పంటల ఉత్పతులను కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలిచింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అన్నదాతను పట్టించుకోవడం లేదు. పంట చేతికందేనాటికి మార్కెట్‌లో ధర తగ్గుముఖం పడితే మద్దతు ధర కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలి. ఆ దిశగా పట్టించుకోకపోవడం రైతులకు శాపంగా మారింది. మద్దతు ధరకంటే మార్కెట్‌లో ఽతక్కువ ధర పలుకుతుండటంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. మొక్కజొన్నలో కోత, నూర్పిడి పనులు పూర్తి అయి దిగుబడులు చేతికందినా కొనుగోలు కేంద్రాల ఊసేలేకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ధర నిర్ణయిస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు.

రోడ్డుపై ఆరబోసిన మొక్కజొన్న

ఎండుతెగులు, మద్దతు ధర లేక అవస్థలు పడుతున్న రైతులపై మూలిగే నక్కపై తాటికాయపడ్డ చందంగా అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. గత నెల నుంచి ఇప్పటి వరకు ఇప్పటికే మూడు సార్లు అకాల వర్షాలు కురిసి రైతులకు నష్టం చేకూరింది. కోత, నూర్పిడి దశలో వర్షాలు పడటంతో దిగుబడులు తడిచిపోయాయి. వర్షాలబారి నుంచి దిగుబడులను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఉత్పత్తులపై పట్టలు కప్పినా పట్టల్లోనుంచి నీరు దిగి తడిచిపోతుండటంతో ఆవేదన చెందుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలాలు, కలాల్లో దిగుబడులు ఆరబోసుకుని గింజల నాణ్యతను కాపాడుకునేందుకు అగచాట్లు పడుతున్నారు. వాతావరణంలో మార్పు సంభవిస్తే పట్టలు కప్పుకోవడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. మార్కెట్‌లో ధర లేకపోవడంతో దిగుబడులను సురక్షిత ప్రాంతాలకు తరలించుకునేందుకు అదనపు భారం పడుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దిగుబడులు విక్రయించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement