సీఎం సారూ..
నకిరేకల్ : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం నకిరేకల్లో పర్యటించనున్న నేపథ్యంలో నియోజకవర్గంలో సమస్యలకు మోక్షం లభిస్తుందని ప్రజలు భావి స్తున్నారు. ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలకు సీఎం పర్యటనలో పరిష్కార మార్గాలు చూపాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో మరిన్ని వరాలు ప్రకటిస్తారా.. అన్నదానిపై ఆసక్తి నెలకొంది.
మూసీ వద్ద మరో వంతెన నిర్మించాలి..
మూసీ ప్రాజెక్టు నిర్మించి ఆరు దశబ్దాలు దాటినా నేటికి సరైన రావాణా సౌకర్యం లేదు. జలాశయాన్ని దాటి అవలి వైపు ఉన్న సూర్యాపేట జిల్లాలోని గ్రామాలకు చేరుకునేందుకు ప్రత్యేక వంతెన లేదు. ప్రస్తుతం డ్యాం మీదనుంచి కేవలం ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. డ్యాం దిగువన ప్రత్యేక వంతెన నిర్మాణం జరిగితే మూసీ దశ మారనుంది. పర్యాటక కేంద్రంగా మారుతుంది.
సమస్యలివిగో.. సీఎం సారు...!
65వ నంబర్ జాతీయ రహదారిపై పద్మానగర్ జంక్షన్ వద్ద అండర్ పాసింగ్ నిర్మించాలి. బైపాస్ వెంట సర్వీస్ రోడ్లనిర్మాణం చేపట్టాల్సి ఉంది.
నకిరేకల్లో రూ.26 కోట్లతో చేపట్టిన రోడ్ల విస్తరణ, అమృత్ పథకం కింద ఇంటింటికి తాగునీటి సరఫరా పనులు నత్తనడకన సాగుతున్నాయి.
మూసీ రోడ్డులో రూ.6.30 కోట్లతో 2021లో చేపట్టిన సమీకృత మార్కెట్ పనులు పిల్లర్ల దశలోనే ఉన్నాయి.
నకిరేకల్ మున్సిపలిటీ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మించాల్సి ఉంది.
మెయిన్ సెంటర్లో బస్షెల్టర్ ఏర్పాటు చేయాలి.
నకిరేకల్ పెద్ద చెరువు, కాలంవారీ కుంటలను మినీ ట్యాంక్ బండ్లు మార్చినా.. అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో చేపట్టలేదు.
నకిరేకల్లో తహసీల్దార్, ఎంపీడీఓ, ఎమ్మార్సీ, పశు వైద్యశాల, పంచాయతీరాజ్ శాఖలకు సొంత భవనాలు నిర్మించాల్సి ఉంది.
రూ.100 కోట్లతో చేపట్టిన కట్టంగూర్ మండలం అయిటిపాముల లిఫ్ట్ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
కేతేపల్లి మండలం మూసీ ప్రాజెక్టు వద్ద పదేళ్ల క్రితం రూ.19 కోట్లతో చేపట్టిన గురుకుల పాఠశాల, వసతి గృహల భవన నిర్మాణం పనులు నిధుల కొరతతో అసంపూర్తిగానే ఉన్నాయి.
కేతేపల్లి నుంచి మూసీ వద్దకు వెళ్లే దారి అధ్వానంగా మారింది.
కేతేపల్లి మండలంలో మరో రెండు విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది.
నార్కట్పల్లి మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి.
నార్కట్పల్లిమండలంలోని బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులో భాగంగా కుడి, ఎడమ కాల్వల పనులు నేటికి పూర్తి చేయలేదు.
చిట్యాల మండలంలో ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి కాల్వల నిర్మాణం పనులు అంసపూర్తిగా ఉన్నాయి.
చిట్యాలలోని ప్రభుత్వాసుపత్రి శిథిలావస్థకు చేరింది. ఈ వైద్యశాలను 50 పడకల స్థాయికి పెంచాల్సి ఉంది.
ఫ నకిరేకల్ నియోజకవర్గంలో ఏళ్లగా తిష్టవేసిన సమస్యలు
ఫ ముఖ్యమంత్రి నిధులిస్తారని ప్రజల ఆశలు


