జలాశయంలో కలుషితమైన నీరు
పచ్చగా మారిన నీరు
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ జలాశయంలోని నీరు కులషితమైంది. సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ పైభాగంలోని దయ్యాలగండి సమీపంలో జలాశయం నీరు పచ్చగా మారడంతో పాటు నీటి పైభాగంలో ఆయిల్ తెట్టు ఏర్పడినట్లు ఉంది. అంతే కాకుండా నీటి ఒడ్డునగల పచ్చని గడ్డి మాడిపోయినట్లు కనిపించడంతో నీటిలో ఏదో రసాయనం కలిసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి కలుషిత నీరు వచ్చి జలాశయంలో కలిసిందా? లేక జలాశయంలో తిరిగే మరపడవల నుంచి డీజిల్, పెట్రోల్, గ్రీజు తదితర వ్యర్థాలు నీటిలో కలిశాయా? లేక చేపల వేట కోసం నీటిలో ఏవైనా రసాయనాలు కలిపారా? అనే అనే అనుమానలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు వెంటనే దయ్యాలగండి ప్రాంతాన్ని సందర్శించి నీటి నమూనాలను సేకరించి ల్యాబ్లో పరీక్షలు నిర్వహించాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు. నీటిలో ఏ పదార్థాలు కలిశాయో గుర్తించి ప్రజలకు పశువులు, జలచరాలకు ఏమైనా నష్టజరిగే ప్రమాదం ఉందా అనే విషయాన్ని స్పష్టం చేయాలని కోరుతున్నారు.


