నల్లగొండ టౌన్ : ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మంగళవారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా బుధవారం మాన్యంచెల్కలో రూ.కోటీ 91 లక్షల వ్యయంతో నిర్మించిన పట్టణ పాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మాన్యంచెల్క పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వ నిధులతో పాటు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా రూ.50 లక్షలు అందించి మౌలిక సదుపాయాలను కల్పించామన్నారు. పట్టణంలో ప్రతీక్ ఫౌండేషన్, ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి సంయుక్తంగా మూడెకరాల స్థలంలో కంటి ఆస్పత్రిని నిర్మించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మాన్యంచెల్క జంక్షన్ను ఆధునీకరించనున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య, డిప్యూటీ మేయర్ అమీర్అలీ, ఎమ్మెల్సీ శంకర్నాయక్, కలెక్టర్ చంద్రశేఖర్, కార్పొరేటర్ కుందూరు దీపిక ప్రవీణ్కుమార్రెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జీజీహెచ్ సూపరింటెండెంట్ నర్సింహారావు నేత, డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్రెడ్డి, డాక్టర్ కళ్యాణ్చక్రవర్తి, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


