భూదాన్పోచంపల్లి : రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేపడుతున్న నేపథ్యంలో మానవ హక్కుల వేదిక, క్లైమెట్ ఫ్రంట్ సంస్థ, మూసీ పరిరక్షణ సమితి సంస్థకు చెందిన 14 మంది ప్రతినిధుల బృందం సోమవారం భూదాన్పోచంపల్లి పరిధిలో మూసీ పరీవాహక గ్రామాల్లోని కాలువలు, చెరువులు, పంట పొలాలను సందర్శించారు. జూలూరు గ్రామంలో రైతులు, గీత కార్మికులు, మత్స్యకారులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉభయ రాష్ట్రాల సమన్యయ కమిటీ సభ్యులు వసంతలక్ష్మి, జీవన్కుమార్ మాట్లాడుతూ.. మూసీ కాలువలు, చెరువుల్లోని నీరంతా పచ్చగా ఉండి దుర్వాసన వస్తోందన్నారు. మూసీ కాలుష్య నీటితో పండించే పంటలు, చేపలు తినడానికి పనికిరావని తెలిపారు. ప్రభుత్వం మూసీ సుందరీకరణకు కేటాయించిన బడ్జెట్లో రూ.2వేల కోట్లు గ్రామ వ్యవస్థలకు కేటాయించాలన్నారు. అలాగే శిథిలావస్థకు చేరిన కత్వలు, కాలువలను ఆధునీకరించాలని, కాలుష్యంతో కూడిన చెరువులను పూడికతీసి పరిశుభ్రపర్చాలని కోరారు. అలాగే గ్రామాలకు రక్షిత మంచినీటి సరఫరా చేయాలని, మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నాన్నారు. మూసీ పునరుద్ధరణను గౌరెల్లి నుంచి సోలిపేట మూసీ సాగునీటి డ్యాం వరకు పొడిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేశ్బాబు, నగర కమిటీ సభ్యులు రోహిత్, శ్రావ్య, ప్రొఫెసర్ శ్రీధర్, బాలయ్య, ఆకాశ్, రుచిత్, అభిషేక్, గ్రామస్తులు దిండు బాలరాజు, చిలువేరు అయిలయ్య, బస్వయ్య, అయిలయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.


