చిట్యాల : సమాజ సేవతోనే గుర్తింపు లభిస్తుందని రిటైర్డ్ జడ్జి జస్టిస్ కుకుడాల లక్ష్మణ్ అన్నారు. ప్రమోద సాహితీ సంస్థ ఆధ్వర్యంలో చిట్యాలలో గురువారం రాత్రి ఉగాది కవి సమ్మేళనం నిర్వహించారు. అనంతరం వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన దాసరి శ్రీరాములు(విద్యారంగం), డాక్టర్ మూడ సుదర్శన్ (వైద్యరంగం), యేళ్ల భయ్యన్న(జర్నలిజం), కొంతం సత్తిరెడ్డి(వ్యవసాయం)లకు ఉగాది పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రమోద సాహితీ సంస్థ అధ్యక్షుడు కందిమళ్ల కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పందిరి గీతారమేష్, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మీ సైదులు, ఏఎంసీ చైర్మన్ నర్రా వినోదమోహన్రెడ్డి, శ్రీకనకదుర్గా ఆలయ చైర్మన్ మారగోని ఆంజనేయులు, తెలంగాణ సాహితీ సంస్థ జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్, ప్రమోద సాహితీ సంస్థ ప్రధాన కార్యదర్శి తాడూరి చంద్రం, కౌన్సిలర్ జెర్రిపోతుల సత్యనారాయణ, బొబ్బల శివశంకర్రెడ్డి, నర్రా భిక్షంరెడ్డి, చిలివేరు నర్సింహ, కాకులారపు బొర్రారెడ్డి, కంభంపాటి నర్సింహ, మల్లేష్, కృష్ణ పాల్గొన్నారు.
ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయొద్దు
కట్టంగూర్ : ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే సహించేదిలేదని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. గురువారం కట్టంగూర్ మండలం చెర్వుఅన్నారం గ్రామంలో నిర్వహించిన ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫొటో క్యాప్చర్ విధానంతో కూలీలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తోందన్నారు. ఉపాధి హామీ నిధుల విషయంలో గతంలో 90 శాతం నిధులు ఇస్తుండగా ప్రస్తుతం 60 శాతానికి తగ్గించిన కేంద్రం.. రాష్ట్రాలపై 40 శాతం భారం మోపడం దారుణమన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీలకు కనీస వేతనం రోజుకు రూ.600 చొప్పున ఇస్తూ 200 రోజులు పనిదినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం మండల కార్యదర్శి పెంజర్ల సైదులు, చిలుముల రామస్వామి, గడగోజు రవింద్రాచారి, గద్దపాటి సుధాకర్, కృష్ణయ్య, పొన్న సురేష్, గంట మల్లేష్, నర్సింహ పాల్గొన్నారు.
సంత వేలం
23వ తేదీకి వాయిదా
మునుగోడు : మునుగోడు పశువుల సంత వేలం ఈ నెల 23వ తేదీకి వాయిదా పడింది. బుధవారం సంత వేలం పాట నిర్వహించినా అనుకున్న పాట రాకపోవడంతో ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసినట్లు పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్రెడ్డి తెలిపారు. అదేరోజు మధ్యాహ్నం 2 గంటలలోపు డీడీలు చెల్లించి కొత్తవారు కూడా వేలంలో పాల్గొనాలని కోరారు.
గరుడ వాహన సేవ
మఠంపల్లి : మట్టపల్లి దేవాలయంలో గురువారం గరుడవాహన సేవను ఊరేగించారు. అంతకుముందు శ్రీలక్ష్మీ నరసింహ స్వామికి శ్రీ రాజ్యలక్ష్మీ, చెంచులక్ష్మీ అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ ఆంజనేయ స్వామికి శ్రీ గోదాదేవి అమ్మవారికి విశేష పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు,అర్చకులు పాల్గొన్నారు.


