చిట్యాల : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు జిల్లాలో 6,409 ఇందిరమ్మ గృహ ప్రవేశాలు పూర్తిచేస్తామని కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ పేర్కొన్నారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి, గుండ్రాంపల్లి గ్రామాల్లో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ గృహ ప్రవేశాల కార్యక్రమానికి గురువారం ఆయన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మరో మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 2,281 గృహ ప్రవేశాలకు ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో 348 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకంతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేస్తోందన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్, హౌసింగ్ డీఈ అబ్దుల్ వాజిద్, తహసీల్దార్ విజయ, ఎంపీడీఓ జయలక్ష్మీ, హౌసింగ్ ఏఈ ప్రీతి, చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్, పెద్దకాపర్తి, గుండ్రాంపల్లి గ్రామాల సర్పంచ్లు కాటం వెంకటేశం, బత్తుల లక్ష్మీప్రసన్న నర్సింహ, డీసీసీ కార్యదర్శి పోకల దేవదాసు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీనర్సింహ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


