● కలెక్టర్ చంద్రశేఖర్
● ప్రధానమంత్రి విశ్వకర్మ లబ్ధిదారుల వాణిజ్య ప్రదర్శన ప్రారంభం
నల్లగొండ : ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద చేతివృత్తుల ప్రోత్సాహానికి మంచి అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం నల్లగొండలో సూక్ష్మ, మధ్య, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రధానమంత్రి విశ్వకర్మ లబ్ధిదారుల వాణిజ్య ప్రదర్శనను ఆయన ప్రారంభించి మాట్లాడారు. చేతివృత్తుల కళాకృతుల ప్రోత్సాహాకానికి ప్రభుత్వం నుంచి మొదటి విడతగా రూ.లక్ష మంజూరవుతాయని తెలిపారు. ఏడాదిన్నరలో రుణం తిరిగి చెల్లిస్తే రెండవ విడత రూ.2 లక్షలు రుణం వస్తుందన్నారు. ఎంఎస్ఎంఈ ద్వారా తక్కువ వడ్డీకి రుణం అందుబాటులో ఉండటంతో చిన్న వ్యాపారాలు నిర్వహించుకునే వారికి ఇది మంచి అవకాశమన్నారు. జిల్లాలో సుమారు 3,580 మంది లబ్ధిదారులు ఎంఎస్ఎంఈ కింద దరఖాస్తులు చేసుకున్నారని.. వారు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని లబ్ది పొందాలన్నారు. 8వ తేదీ వరకు జరుగనున్న వాణిజ్య ప్రదర్శన ద్వారా మార్కెట్ సదుపాయాలు, డిజిటల్ మార్కెట్ సౌకర్యం వంటి వాటిపై అవగాహన కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ సహాయ సంచాలకుడు నవీన్, జిల్లా పరిశ్రమల మేనేజర్ సతీష్, ఎల్డీఎం శ్రామిక్, మెప్మా పీడీ శ్రీనివాస్, బీసీ సంక్షేమ అధికారి సంజీవ పాల్గొన్నారు.
‘ప్రజాపాలన’
విజయవంతం చేయాలి
నల్లగొండ టౌన్ : ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ కోరారు. శుక్రవారం నల్లగొండలోని లైన్వాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక వైద్యులతో ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పేదవారికి ప్రత్యేక వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ నెల 31వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒకేరోజు ఆరు రకాల ప్రత్యేక వైద్య సేవలు అందించానికి నిపుణులైన వైద్యుతో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా రోగులకు ప్రత్యేకంగా ఐడీ నంబర్ ఇస్తామని, ఆ ఐడీ ద్వారా భవిష్యత్లో కూడా వైద్య సేవలు అందుతాయని తెలిపారు. అనంతరం ఆయన రోగులతో ముఖాముఖి మాట్లాడారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్రెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్ నరసింహారావు, జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, లైన్ వాడ యూపీహెచ్సీ డాక్టర్ ఇఫ్టేయార్, కార్పొరేటర్ మహమ్మద్ ఖాజా సమయుద్దీన్ నదీమ్, వైద్యులు పాల్గొన్నారు.


