నల్లగొండ: మూడు నెలలకు సంబంధించి రేషన్ బియ్యాన్ని ఒకే నెలలో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెల్లరేషన్ కార్డుదారులకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి ఏప్రిల్ నెలలోనే బియ్యం పంపిణీ చేయనుంది. ఈ మేరకు గోదాముల్లో ఉన్న బియ్యాన్ని రేషన్ షాపులకు తరలించాలని ఎఫ్సీఐ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా బియ్యం పంపిణీ చేయాలని సూచించింది.
5,38,650 రేషన్ కార్డుదారులు
జిల్లాలో 5,38,650 రేషన్ కార్డుదారులున్నారు. ఒక్కో కార్డులో యూనిట్ ఆరు కిలోల చొప్పున జిల్లాలో ప్రతి నెల 7900 మెట్రిక్టన్నుల బియ్యాన్ని 1051 రేషన్షాపుల ద్వారా పేదలకు పంపిణీ చేస్తున్నారు. ఇక మూడు నెలలకు ఒకేసారి బియ్యం ఇస్తుండడంతో 23,700 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం కానుంది. ఈ బియ్యాన్ని రేషన్షాపులకు తరలించనున్నారు. అయితే మూడు నెలల బియ్యం దిగుమతికి రేషన్ దుకాణాల్లో స్థలం కొరత ఏర్పడే అవకాశం ఉంది.
గోదాములు ఖాళీ చేసేందుకేనా..
దేశ వ్యాప్తంగా అన్ని గోదాముల్లో బియ్యం నిల్వలు పేరుకుపోయాయి. గత వానాకాలానికి సంబంధించిన సీఎంఆర్ వస్తోంది. ప్రస్తుతం గోదాముల్లో బియ్యం నిల్వలను ఖాళీ చేయకపోవతే సీఎంఆర్ తీసుకునే పరిస్థితి లేనందున ప్రస్తుతం ఉన్న నిల్వలను.. 3 నెలలకు సంబంధించి ఒకేసారి పంపిణీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ యుద్దం కారణంగా మధ్య ఆసియాలో ఉద్రిక్తత నెలకొంది. యుద్దం అలాగే కొనసాగితే అయిల్ దిగుమతికి ఇబ్బందులు ఏర్పడి.. రేట్లు పెరిగే అవకాశం ఉంది. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా పేదలకు బియ్యం ఇవ్వడంతో పేదలకు మేలు జరగడంతో పాటు అటు గోదాములు ఖాళీ అయి సీఎంఆర్కు ఇబ్బందులు ఉండవనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.
ఫ ఏప్రిల్, మే, జూన్ మాసాలకు
సంబంధించి ఏప్రిల్లో
ఇవ్వాలని నిర్ణయం
ఫ గోదాముల్లో నిల్వలను
తగ్గించేలా చర్యలు
ఫ రేషన్ దుకాణాలకు తరలనున్న 23,700 టన్నుల బియ్యం


