నల్లగొండ : ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’ నిర్వహణపై ఈనెల 6న నల్లగొండలో ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా నుంచి మంత్రులు, ప్రభుత్వ అధికారులు హాజరు కానున్నారన్నారని పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు నిర్వహించనున్న ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. అధికారులు వారంలో కనీసం నాలుగు రోజులు క్షేత్రస్థాయిలో ఉండాలని, నిబద్ధతతో, బాధ్యతగా పనులు నిర్వర్తించాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించే గ్రామసభలు, మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. అనంతరం ఆయా అంశాల వారీగా నిర్వహించాల్సిన పనులపై సంబంధిత శాఖల అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, ఆర్డీఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫ ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ నిర్వహణపై కార్యాచరణ


