కొండమల్లేపల్లి : తన తల్లి పేరున ఉన్న భూమిని మరో వ్యక్తి పేరన చేస్తున్నారని ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకొని హల్చల్ చేశారు. సోమవారం కొండమల్లేపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. మండలంలోని కొత్తబావి గ్రామానికి చెందిన పిల్లి లింగయ్య తల్లి లక్ష్మమ్మ పేరున సర్వే నంబర్ 151లో 24 గుంటల భూమి ఉంది. 2013లో అదే గ్రామానికి చెందిన పిల్లి యాదయ్యకు అందులో నుంచి 12 గుంటల భూమిని వ్రికయించారు. కానీ.. యాదయ్యకు నాలుగు గుంటలు మాత్రమే రికార్డుల్లో ఎక్కింది. లక్ష్మమ్మ పేరుమీద ఇంకా 20 గుంటల భూమి ఉంది. అయితే.. ఆ 8 గుంటల భూమిని తనకు తెలియకుండా రైతు యాదయ్య పేరున చేస్తున్నారని భావించిన రైతుల లింగయ్య తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. గమనించిన సిబ్బంది, అతని భార్య, కూతురు అడ్డుకున్నారు. ఈ విషయమై తహసీల్దార్ నరేందర్ను వివరణ కోరగా.. కొన్నేళ్ల క్రితం జరిగిన భూమి క్రయ, విక్రయంలో భాగంగా యాదయ్యకు 8 గంటల భూమి రావాల్సి ఉందని తెలిపారు. అదే విధంగా రైతు లింగయ్యకు.. మరో రైతు రాములు నుంచి 8 గుంటలు రావాల్సి ఉండడంతో.. ఆ భూములకు సంబంధించి ఎవరికి వారు స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించామని తహసీల్దార్ పేర్కొన్నారు. అవగాహన లోపంతో రైతు లింగయ్య ఇలా చేయడం సరికాదన్నారు.
ఫ కొండమల్లేపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఘటన


