
విద్యుత్ ప్రమాదాలను అరికడతాం
నిమజ్జనం రోజు ప్రత్యేక నిఘా
పోలీస్ శాఖ సూచనలు ఇవీ..
నల్లగొండ: ఈనెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో మండపాల వద్ద ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా పక్కాగా చర్యలు తీసుకుంటున్నట్లు టీజీ ఎస్పీడీసీఎల్, జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. గణేష్ నవరాత్రుల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే శాంతి కమిటీ సమావేశం నిర్వహించామన్నారు. ఉత్సవాలకు సంబంధించి విద్యుత్ శాఖ పరంగా ఏర్పాట్లపై వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే..
కమిటీ ధ్రువీకరణ పత్రంతో విద్యుత్ కనెక్షన్..
గణేష్ మండపాలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో గణేష్ ఉత్సవ కమిటీ ధ్రువీకరించిన పత్రం ఆధారంగా నిర్ణీత రుసుముతో డీడీ చెల్లిస్తేనే మండపాలకు విద్యుత్ కనెక్షన్ను ఇస్తాం. 250 ఓల్టేజీ వరకు రూ.500, 250 నుంచి 500 వోల్టేజీ వరకు రూ.వెయ్యి, 500 నుంచి 1 కిలోవాట్ ఓల్టేజికి రూ.1,500, అంతకంటే మించి విద్యుత్ అవసరమున్న వారు అదనంగా ప్రతి 500 వోల్టేజీ రూ.700 చొప్పున విద్యుత్ శాఖకు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.
విద్యుత్ లైన్లు ఉన్నచోట మండపాలు వద్దు
గణేష్ మండపాలను హెచ్టీ లైన్ గాని, ఇతర లైన్లు ఉన్న చోట ఏర్పాటు చేయవద్దు. నాసిరకం సర్వీస్ వైర్లను వాడవద్దు. వర్షాల నేపథ్యంలో ప్రమాదాలకు అవకాశం ఉంది. భక్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది దృషిలో ఉంచుకుని ప్రమాదాలు జరగకుండా నాణ్యమైన వైర్లను వాడాలి.
మండపాల వద్ద విద్యుత్ సిబ్బంది
ప్రతి మండపం వద్ద విద్యుత్ సిబ్బందిని నియమిస్తాం. అక్కడ ఫ్లెక్సీ మీద వారి ఫోన్ నంబర్లు ఉంచుతారు. విద్యుత్ శాఖ పరంగా అవసరమైన ఏర్పాట్లు చేస్తాం. ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. లూజ్ లైన్లు ఉన్నచోట వాటిని ఎత్తులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మండపాల ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తాం.
నిమజ్జనం రోజు ప్రత్యేకంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఊరేగింపు సందర్భంగా ఎలాంటి విద్యుత్ పరమైన ఇబ్బంది లేకుండా తమ సిబ్బందితో పర్యవేక్షిస్తారు. ప్రమాదం జరిగితే విద్యుత్ సరపరా నిలిపివేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు. నిమజ్జనం చెరువు వద్ద అవసరమైతే విద్యుత్ దీపాల ఏర్పాటుకు మొబైల్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తాం. రాత్రి సమయంలో నిమజ్జనం జరిగే అవకాశం ఉన్నందున ప్లడ్ లైట్లు ఏర్పాటు చేసి నిరంతరంగా విద్యుత్ సరపరా చేస్తాం.
గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు
ఫ మండపాలపై నిరంతర పర్యవేక్షణ
ఫ డీడీ చెల్లిస్తేనే విద్యుత్ కనెక్షన్
ఫ నాసిరకం సర్వీస్ తీగలు వాడొద్దు
ఫ విద్యుత్ శాఖ ఎస్ఈ వెంకటేశ్వర్లు
గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండపాల వద్ద పోలీస్ శాఖ పటిష్ట నిఘా ఏర్పాటు చేయనున్నారు. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రత్యేకంగా పెట్రోలింగ్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమతున్నారు. ఈ సందర్భంగా ఆ శాఖ అధికారులు చేస్తున్న సూచనలు
ఎన్ని ఫీట్ల విగ్రహం ఏర్పాటు చేస్తున్నారనేది పోలీస్ శాఖ ఇచ్చే ఆన్లైన్ లింక్లో గణేష్ ఉత్సవ కమిటీ అప్లోడ్ చేయాలి. అలా దరఖాస్తు చేస్తే జియోట్యాగ్ లోకేషన్ ద్వారా పగలు, రాత్రి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తారు.
గణేష్ విగ్రహాల వద్ద నిర్వాహకులు సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
వినాయక మండపాలను విద్యుత్ లైన్లు ఉన్న చోట, ఇరుకు సందుల్లో కాకుండా ఓపెన్ స్థలాల్లో ఏర్పాటు చేయాలి. రాత్రివేళల్లో ఇద్దరు నిర్వాహకులు మండపాల వద్ద ఉండాలి.
మండపాల వద్ద నిత్యం రెండు బకెట్ల నీరు, ఇసుకను సిద్ధంగా ఉంచుకోవాలి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్, ఇతర అగ్ని ప్రమాదాలు జరిగితే వాటిని నిరోధించడానికి ఇవి ఉపయోగపడతాయి.
మండపాల వద్ద యువత మద్యం సేవించి ఇతరులను ఇబ్బందులకు గురి చేయరాదు.
నిమజ్జనం రోజు ఎత్తయిన విగ్రహాలు ఉంటే ఇబ్బందులు జరగకుండా విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ శోభాయాత్రలు కొనసాగించాలి.